ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. శివసేనకు సీఎం పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ అంగీకరించినట్లు సమాచారం. శివసేన నేతలు చెబుతున్నట్లు ఐదేళ్ల పాటు ఆ పార్టీ నేతనే సీఎంగా ఉంటారా ? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, మహారాష్ట్ర సీఎంగా ఎవరు అవుతారనేది ఉత్కంఠగా మారింది.
మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. శివసేనకు చెందిన నేతే మహారాష్ట్రకు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని ఆపార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని, తాము తీసుకున్న నిర్ణయాన్ని రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తెలుపుతామని చెప్పారు.
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం రాత్రి పొద్దు పోయాక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవుల పంపకం తదితరాలపైనే చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రేయే సీఎం కావాలని శరద్ పవార్ కోరినట్లు సమాచారం. మరోవైపు సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే లేదా ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రే ఉండాలని ఆపార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఉద్దవ్ ఠాక్రే ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం రేసులో శివసేన ముఖ్య నేతలు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, శరద్పవార్, సోనియాతో చర్చించిన అనంతరం ఉద్దవ్ ఠాక్రే శివసేన సీఎం ఎవరనే విషయంపై స్పష్టత ఇవ్వనున్నారు.
ఇక గురువారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో శివసేన, ఎన్సీపీలతో కలిసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శివసేన, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్లూ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు వెలువడతుండడంతో కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే మంత్రి పదవుల కోసం లాబీయింగ్ ప్రారంభించారని సమాచారం. గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి, తాజా ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ కు 12 శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.