(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రెబల్ శాసనసభ్యులను కలిసేందుకు ముంబై వెళ్లిన కర్నాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ను పోలీసులు చివరికి అదుపులోకి తీసుకున్నారు. ఉదయం బెంగళూరు నుంచి ముంబై చేరుకున్న శివకుమార్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆ హోటల్ దగ్గరకు వెళ్లారు. అయితే అప్పటికే హోటల్ బయట రెడీగా ఉన్న ముంబై పోలీసులు ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
తనకు హోటల్లో రూం బుక్ అయి ఉందని ఎంత చెప్పినా పోలీసులు ససేమిరా అన్నారు. అయితే హోటల్లో ఉన్న తన మిత్రులను కలవకుండా కదిలేది లేదని శివకుమార్ భీష్మించారు. పోలీసులూ పట్టు వీడలేదు. వర్షం మొదలయినప్పటికీ శివకుమార్ గొడుగు కింద కూర్చున్నారు తప్ప కదలలేదు. హోటల్ నుంచే వచ్చిన అల్పాహారం తిని, టీ తాగారు.
ఈలోపు అసమ్మతి శాసనసభ్యుల అనుచరులు కొందరు అక్కడ పోగయ్యారు. వారు శివకుమార్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రతిష్టంభన నాలుగు గంటల పాటు నడిచిన తర్వాత పోలీసులు శివకుమార్నూ, ఆయనతో ఉన్న ఇతర కాంగ్రెస్ నాయకులనూ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.