న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో ముసుగులు ధరించిన కొందరు దుండగులు వర్సిటీలోని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి కర్రలు, రాడ్లు, రాళ్లతో విద్యార్థులపై దాడులకు పాల్పడిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దుండగుల దాడిలో అనేకమంది విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు. ముసుగులు ధరించిన వారు హాస్టల్స్ లోని ఒక్కో గదికి వెళ్లి విద్యార్థులపై దాడులకు దిగారు. ఈ దాడిలో 34 మందికి గాయాలయ్యాయి. వీరిలో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. ముసుగు దొంగల్లా గూండాలు చెలరేగిపోతుంటే విద్యార్థినులు భయంతో కేకలు పెట్టారు. తమను ఎదిరించబోయినవారిపై ముసుగు దుండగులు విచక్షణారహితంగా విరుచుకపడ్డారు. గాయాల బారిన పడి బాధితులు విలవిలలాడుతుండగా గూండాలు మరింత చెలరేగిపోయారు.
#WATCH Delhi: Jawaharlal Nehru University Students' Union president & students attacked by people wearing masks on campus. 'What is this? Who are you? Step back, Who are you trying to threaten?… ABVP go back,' can be heard in video. (note: abusive language) pic.twitter.com/gYqBOmA37c
— ANI (@ANI) January 5, 2020
జేఎన్యూ క్యాంపస్లో ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించిన దుండగులు కర్రలతో స్వైర విహారం చేసి విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. ఏబీవీపీ గూండాలే తమపై దాడికి తెగబడ్డారని జేఎన్యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తుండగా, వామపక్ష విద్యార్ధులే తమ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఏబీవీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జేఎన్యూ ఘటనపై ఫిర్యాదును నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ముసుగు ధరించిన కొందరు దుండగులను గుర్తించారు.
ఈ ఘటనపై తక్షణమే నివేదిక అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించినా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకూ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో మాట్లాడిన అమిత్ షా వర్సిటీ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
మరోవైపు యూనివర్సిటీలో శాంతియుత వాతావరణానికి విద్యార్థులు సహకరించాలని వీసీ జగదీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. శీతాకాల సెమిస్టర్ పరీక్షలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులెవరూ ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దని చెప్పారు. విద్యార్థులకు రక్షణ కల్పిస్తామన్నారు. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తూ వీసీ జగదీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ డిమాండ్ చేసింది. సబర్మతి హాస్టల్ వార్డెన్ ఆర్. మీనా రాజీనామా చేశారు.
ఇదిఇలా ఉంటే.. విద్యార్ధులపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్ధిసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. యూనివర్సిటీలో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ కార్యకర్తలే ముసుగు దాడులకు పాల్పడి క్యాంపస్లో అరాచకం సృష్టించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.