(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేష్పై సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల ఆరాధ్య దేవుడు శ్రీరాముడుపై అవమానకర వ్యాఖ్యలు చేసి హిందువుల మనో భావాలను కత్తి మహేష్ దెబ్బతీశారంటూ పలువురు వ్యక్తులు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ పిర్యాదును పురస్కరించుకొని కత్తి మహేష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు క్రైమ్ నెం. 196/2020, ఐపీసీ 506,507 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే కత్తి మహేష్ మీద సైబర్ క్రైమ్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కత్తి మహేష్ మీద ఐపీసీ సెక్షన్ 505(1)(సి ), సెక్షన్ 502 (2) కింద కేసు నమోదు చేశారు.
హిందువులు ఆరాధ్య దైవంగా భావించే రాముడిని, సీతను గురించి కత్తి మహేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏమిటంటే..రాముడి ఫేవరేట్ డిష్ నెమలి తొడ, జింక మాంసం అనీ, సీత బంగారు జింకను తెమ్మన్నది తినడానికే అని వ్యాఖ్యనించారు. రాముడి అంతఃపురంలో చాలా మంది ఉంపుడుగత్తెలు ఉండేవారంటూ ఏకపత్నీవ్రతుడైన రాముడిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడ్డారు. అతడిపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. కత్తి మహేశ్ను దేశం నుంచి బహిష్కరించాలని మరి కొందరు డిమాండ్ చేశారు.
అయితే రాముడి పట్ల తాను చేసిన కామెంట్లను కత్తి మహేశ్ సమర్థించుకున్నారు. ‘నేను మీ కంటే భయంకరమైన హిందువును.. జాగ్రత్త! గుడ్డిగా ఫాలో అయ్యే రకాన్ని కాదు నేను. దళిత చార్వాకుడిని’ అంటూ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పుల్లెల శ్రీరామచంద్రుడి వాల్మీకి రామాయణం అనువాదం ఉత్తరకాండం, 42 సర్గ,18-22 వచనాలు, 48-49 పేజీలు; యుద్ధంకాండం పేజీ 380 – 81 చూడండి అంటూ విమర్శకులకు ఆయన బదులిచ్చారు.
రాముడి గురించి కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. రాముడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్ను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి ఆరు నెలల పాటు బహిష్కరించింది.