(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మౌనం మాటల కన్నా ఎక్కువ అర్ధాన్ని తెలియపరుస్తుందంటారు. ఆ మాట నిజమేనని ఒక ఎన్నికల ప్రచారసభలో నిరూపితమయింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపితో కలిసి నడుస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్కు అది ఎంత కష్టతరంగా మారిందో తెలియజెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది.
బీహార్లోని దర్భంగా నియోజకవర్గంలో ఏప్రిల్ 25న జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మోదీ సభకు హాజరయిన ప్రజలతో వందేమాతరం అనిపించారు. పిడికిలి విసురుతూ పదేపదే ఆయన వందేమాతరం అన్నదానికి స్పందనగా ప్రజలు కూడా నినదించారు. అదే వేదికపై ఉన్న మరో ఎన్డిఎ భాగస్వామ్యపక్షం నేత రామ్విలాస్ పాశ్వాన్ కూడా వందేమాతరం అన్నారు.
అక్కడే ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. వందేమాతరం అనేందుకు అందరూ లేచి నుంచున్నపుడు నితిష్ ఆఖరున లేచి నిలబడ్డారు. మోదీ నాయకత్వంలోని బిజెపి జాతీయవాద రాజకీయాలతో అంటకాగడం ఆయనకు ఎంత కష్టంగా మారిందీ నితిష్ మౌనం సూచిస్తోంది.
దర్భంగా నియోజకవర్గం ప్రతిపక్ష అభ్యర్ధి అబ్దుల్ బారీ సిద్దికీ ఇటీవల వందేమాతరం ఆలపించేందుకు తనకు అభ్యతంరం ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దుర్గాదేవి కీర్తనగా గుర్తింపు పొందిన వందేమాతరం గేయాలాపన పట్ల ముస్లింలు మొదటినుంచీ అభ్యంతంరం వ్యక్తం చేస్తున్నారు. సిద్దికీ మాటలను వెంటనే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. ‘నా తండ్రి తాత గంగానది ఒడ్డునే జీవితం గడిపారు. వారికి సమాధి అవసరం లేకపోయింది. నిన్ను పూడ్చేందుకు మాత్రం ఆరడుగుల స్థలం కావాలి’ అని ఆయన వ్యాఖ్యనించారు. రెండు రోజుల తర్వాత మోదీ అక్కడకు వెళ్లి వందేమాతరం వివాదానికి తన వంతు జత చేశారు. వందేమాతరం నినాదాన్ని నితిష్ అందిపుచ్చుకోకపోవడంపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, ‘మరి నితిష్ను కూడా జాతి వ్యతిరేకిగా ముద్ర వేస్తారా’ అని ప్రశ్నించారు.
వీడియో ఇక్కడ చూడండి:
video courtesy: punjab kesari tv