అమరావతి: అమరావతి ప్రణాళికపై సమీక్షించుకునే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని సింగపూర్ ఆర్థిక మంత్రి వివిఎన్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ కన్సార్షియం కూడా రాజధాని నిర్మాణ ప్రణాళిక నుండి తప్పుకొంటున్నదని ప్రచారం జరుగుతున్నది. ఈ తరుణంలో సింగపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి బాలకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై స్పందించారు. కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తాము గమనిస్తున్నామని ఆయన చెప్పారు. నూతన ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును సమీక్ష చేయాలనుకుంటోందని సింగపూర్ కన్సార్షియం తమకు తెలిపిందని ఆయన అన్నారు. ఏపి ప్రభుత్వ నిర్ణయం కోసం తాము వేచి చూస్తున్నామనీ, సమీక్ష ప్రభావాన్ని కూడా అంచనా వేసుకుంటున్నామనీ ఆయన తెలిపారు.
ఇండియా – సింగపూర్ నెక్ట్స్ ఫేజ్ సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ సింగపూర్ వెళ్లారు. ఆయనతో పాటు సిఎం అదనపు ప్రధాన కార్యదర్శి రమేష్బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ తదితరులు సింగపూర్ పర్యటనలో ఉన్నారు.
రాష్ట్రంలోనూ రాజధాని అమరావతిపై అనుమానపు మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇంత వరకూ బహిరంగ ప్రకటన చేయలేదు. మంత్రుల వ్యాఖ్యలు, ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్నాయి. రాజధాని భూముల రైతుల్లో అయోమయం, అలజడి నెలకొని ఉన్నాయి.
ఈ సమయంలో సింగపూర్ ఆర్థిక మంత్రి బాలకృష్ణన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.