(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు పంపారు. వైఎస్ వివేకా హత్య కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా కోరారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు పంపినా ఆయన హాజరుకాలేదు. ఈక్రమంలో మరోసారి ఆదినారాయణరెడ్డికి సిట్ నోటీసులు పంపింది. ఈసారి ఎలాగైనా ఆదినారాయణ రెడ్డిని విచారణకు రప్పించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి తాజా నోటీసులపై ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ మారింది.
ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఈ హత్య జరగడంతో ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఆరు నెలలు గడిచినా కూడా ఇంకా బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు బాగా పెరిగాయి. ఈ క్రమంలో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇక ఈ హత్య కేసులో ఇప్పటికే సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఈ కేసు సంబంధించి అనుమానితులతో పాటూ సాక్ష్యుల్ని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి కూడా సిట్ నోటీసులు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.