(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. ఈ కేసులో తదుపరి ఎవరిని పిలుస్తారు ? అన్నది ఉత్కంఠగా మారింది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సిట్ విచారణ అనంతరం బీటెక్ రవి మాట్లాడుతూ, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. తనవద్ద కేసుకు సంబంధించిన సమాచారం ఉందేమోనని సిట్ అధికారులు పిలిచారని చెప్పారు. వివేకా హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నారు ? వివేకా హత్య సమాచారం ఎలా తెలిసింది? అంటూ ప్రశ్నించారని తెలిపారు. వివేకా కేసుకు సంబంధించి ఎప్పుడు పిలిచినా అన్నివిధాలుగా విచారణకు సహకరిస్తానని సిట్ అధికారులతో చెప్పినట్టు వెల్లడించారు. ఈ కేసులో దోషులను మాత్రమే పట్టుకోవాలని, నిర్దోషులు బలవ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డి ఘటనపైనా ఆరా తీశారని బీటెక్ రవి చెప్పారు.
మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు సంబంధించి అనుమానితులతో పాటూ సాక్ష్యుల్ని ప్రశ్నిస్తోంది. అలాగే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి కూడా సిట్ నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మరో వారం పాటు విచారణ జరగనుందని సమాచారం. సిట్ అధికారులు బుధవారం నలుగురు వ్యక్తులను విచారించారు. మరికొందరు అనుమానితులు, సాక్ష్యుల్ని కూడా విచారణకు పిలవనున్నారు. ఇప్పటికే వాచ్మెన్ రంగయ్యకు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయినా కూడా మరోసారి అతన్ని పిలిచి విచారించారు. ఈ మూడు రోజుల్లో 12మందిని ప్రశ్నించిన పోలీసులు… పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ-వైఎస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. జగన్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా నిందితులు మాత్రం దొరకలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్తగా సిట్ను ఏర్పాటు చేశారు. అయితే, ఆరు నెలలు గడిచినా ఈ హత్య కేసులో నిందితులు దొరకలేదు. సీఎం సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోవడం లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో మళ్లీ సిట్ విచారణ వేగవంతం చేసింది.