దళితులకు బలవంతంగా పెట్టిన గ్రామపెద్ద
ఓటు వేయద్దని హుకుం.. రూ. 500 లంచం
తిరుగుబాటుతో ఓట్లు వేసిన ఆరుగురు దళితులు
లక్నో: ఓటు వేయకుండా ఉండేందుకు గ్రామ పెద్దలు ఇచ్చిన రూ. 500ను వాళ్ల ముఖాన కొట్టి.. తమ ఓటు చైతన్యాన్ని నిరూపించుకున్నారు కొందరు దళితులు. గ్రామపెద్దలు వాళ్ల కుడిచేతి చూపుడువేలికి బలవంతంగా సిరాగుర్తులు కూడా పెట్టారు. అయినా, తాము ఓట్లు అమ్ముకునేది లేదని పనరూ రామ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని చందౌలి నియోజకవర్గ పరిధిలో గల జీవన్ పూర్ గ్రామానికి చెందిన ఆరుగురు దళితుల్లో ఆయనొకరు. గ్రామ ప్రధాన్ ఛోటేలాల్ తివారీ బీజేపీ మద్దతుదారుడని, ఆయన తాము ఓట్లు వేయకుండా ఉండేందుకు లంచం ఇవ్వజూపారని వాళ్లు ఆరోపించారు.
ఈ విషయాన్ని బయటపెట్టడంతో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆరుగురూ మే 19న ఓటు వేశారు. ఈసారి వాళ్ల ఎడమచేతి చూపుడువేళ్లకు ఇంకు పెట్టారు. వీటిలో కుడిచేతి వేలికి ఉన్నది నకిలీ ఇంకని, ఎడమచేతిదే అసలైనదని పనరూ రామ్ చెప్పారు. పోలీసులు తివారీని అరెస్టు చేసి, ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆయనతో పాటు కట్వారూ తివారీ, డింపుల్ తివారీ, మరికొందరిపై కేసులు పెట్టారు. కట్వరూ, డింపుల్ పరారీలో ఉన్నారు. అయితే, ఇందులో తమ పాత్ర ఏమీ లేదని బీజేపీ నేతలు ఖండించారు.
తివారీ, అతడి అనుచరులు కలిసి దళిత బస్తీకి మే 18వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో రావడంతో రామ్ కోడలు గీతాదేవి ఆ విషయం చెప్పారు. తాము నిద్రపోబోతుండగా మాజీ ప్రధాన్ వచ్చారని, తన భర్త బన్సీధర్ రామ్ కూడా ఇంట్లోనే ఉన్నారని ఆమె తెలిపారు. తివారీ రెండు రూ. 500 నోట్లను నేలమీద విసిరి, తమ చేతులు పట్టుకుని వేళ్ల మీద ఇంకు వేసేశారని.. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే అంతా అయిపోయిందని ఆమె అన్నారు. తన కూతురు తన కోసం అరుస్తోందని, తాను లేచేలోపే తివారీ వచ్చి తన వేలిమీద ఇంకేసి రూ. 500 నోటు మంచం పక్కన పెట్టి వెళ్లిపోయారని పక్కింటికి చెందిన బాదామీ దేవి (49) తెలిపారు. రాత్రి 10 గంటలకు నిరసనలు మొదలయ్యాయి. తాము చెప్పినపుడు పోలీసులు స్పందించలేదని, స్థానిక నాయకులొచ్చాక అప్పుడు కదిలారని సుదర్శన్ రామ్ అన్నారు. ఆయన వేలికీ ఇంకు పడింది. చందౌలీ బీజేపీ అభ్యర్థి మహేంద్రనాథ్ పాండేకు మద్దతుగానే ఛోటేలాల్ తివారీ ఈ పని చేశారంటున్నారు.
2014లో చందౌలిలో బీజేపీ గెలిచింది. తాము నిరసన తెలియజేశాకే దళితులను ఓట్లు వేయనిచ్చారని ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సంజయ్ చౌహాన్ ఆరోపించారు. ఇంకా చాలా మంది వేళ్లకు వీళ్లు బలవంతంగా ఇంకు వేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఓటమి తప్పదన్న నిస్పృహతోనే సమాజ్ వాదీ పార్టీ ఇలా నిరసనలకు దిగుతోందని చందౌలి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సర్వేష్ కుష్వాహా తెలిపారు.