న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాల్సింది రాహుల్ గాంధీయా.. లేక ఆయన తల్లి సోనియానా అన్న విషయం కాంగ్రెస్ ఎంపీలు శనివారం నిర్వహించే సమావేశంలో తేలిపోనుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ నాయకులతో రాహుల్ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఆయన ఆలోచనలను మార్చాలన్న ఉద్దేశంతో, రాహుల్ గాంధీనే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా చేయాలని నాయకులు భావిస్తున్నారు. 543 స్థానాలున్న లోక్ సభలో కేవలం 52 మాత్రమే గెలుచుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కడం లేదు. 2014 కంటే బీజేపీకి ఎక్కువ ఆధిక్యం రావడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలబడింది.
కాంగ్రెస్ సంప్రదాయాన్ని బట్టి సోనియానే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగించాలని కూడా ఒక ప్రతిపాదన ఉంది. అయితే, పార్టీ అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకొంటానని రాహుల్ గాంధీ గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే, ఆ ఆలోచన మానుకోవాలంటూ పలు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు తీర్మానాలు కూడా చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత గత సోమవారం అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ ఇద్దరిని మాత్రమే రాహుల్ కలిశారు. రెండు రోజుల తర్వాత తన పెంపుడు కుక్కను తీసుకుని కారులో వెళ్లారు. తర్వాత తన తల్లితో కలిసి ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.
సీనియర్ నాయకులు కొందరు తమ కొడుకుల కోసం పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టారంటూ సీడబ్ల్యుసీ సమావేశంలో రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో 1999లో కూడా ఇలాంటి సంక్షోభం తలెత్తింది. అప్పట్లో సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే, సీనియర్ నేతలు శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ ఆమె విదేశీ మూలాల కారణంగా అభ్యంతరం చెప్పడంతో.. ఆమె రాజీనామా చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు దీనిపై నిరసనలు వ్యక్తం చేయడం, అసంతృప్తులను పార్టీ బహిష్కరించడంతో సోనియా మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టారు.