న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆదివారం రాత్రి విద్యార్థులు, అధ్యాపకులపై దుండగులు జరిపిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మోదీ అండతో మూకలు రెచ్చిపోతున్నాయని, విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు, యువతకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వంలో ఇలాంటి దాడులు జరగడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని సోనియా డిమాండ్ చేశారు. అసమ్మతి స్వరాన్ని అణచివేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు దేశంలోని క్యాంపస్, కాలేజీల్లో పోలీసులు లేదా ఇతర అసాంఘిక స్వార్థ శక్తులు దాడులకు దిగుతున్నాయని సోనియా ధ్వజమెత్తారు. యువత, విద్యార్థులు భయపడవద్దని.. వారి వెంట కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా కల్పించారు.
Statement by Congress President Smt. Sonia Gandhi condemning the violent attack on JNU students & teachers and the ongoing subjugation of students voices in the country. #ChhatraVirodhiBJP pic.twitter.com/V1DoYKoWxJ
— Congress (@INCIndia) January 6, 2020
జేఎన్యూ విద్యార్ధులపై ముసుగు దుండగుల దాడిని ముంబై పేలుళ్ల దాడితో పోల్చారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. విద్యార్ధులపై దాడులను తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని అన్నారు. దేశంలో విద్యార్ధులు అభద్రతకు లోనయ్యే పరిస్థితి నెలకొందని, జేఎన్యూలో జరిగిన ఘటనలు మహారాష్ట్రలో తాను జరగనివ్వనని స్పష్టం చేశారు. యువతను రెచ్చగొట్టి వారితో చెలగాటమాడవద్దని సూచించారు. జేఎన్యూలో దాడికి పాల్పడిన ముసుగుల వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలన్నారు. ముసుగు ధరించేవారు పిరికిపందలని, ధైర్యం ఉన్న వారు బహిరంగంగానే ముందుకువస్తారని సీఎం ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
People behind masks should be brought forward and be punished.
There is an atmosphere of fear amongst the youth in our country, we need to come together & instill confidence in them.
-CM Uddhav Balasaheb Thackeray pic.twitter.com/ZsGnkyME66— Office of Uddhav Thackeray (@OfficeofUT) January 6, 2020
ఢిల్లీ జేఎన్యూ క్యాంపస్లో ఆదివారం(జనవరి 5) రాత్రి ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాడ్లు, కర్రలతో విద్యార్ధులు, టీచర్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 34 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఈ దాడికి పాల్పడిండి ఏబీవీపీ కార్యకర్తలని జేఎన్యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తుండగా, వామపక్ష విద్యార్ధులే తమ సభ్యులపై దాడి చేశారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు.
మరోవైపు దేశంలోని వివిధ వర్గాలు జేఎన్యూ విద్యార్థులకు తమ సంఘీభావం కూడా ప్రకటించారు. రాజకీయ పక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. ముందస్తు పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.