న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియలో పాలు పంచుకునేందుకు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ నిరాకరించారు. శనివారం మొదలయిన సంప్రదింపుల కార్యక్రమం నుంచి ఆ ఇద్దరూ బయటకు నడిచారు. రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ మాత్రం ఈ ప్రక్రియలో పాలు పంచుకుంటున్నారు.
విస్తృతంగా సంప్రదింపులు జరపాలన్న రాహుల్ గాంధీ సూచన మేరకే అయిదు గ్రూప్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులతో పాటు పిసిసి అధ్యక్షులు కూడా ఈ గ్రూప్లలో సభ్యులుగా ఉన్నారు. ప్రాంతాల వారీగా అభిప్రాయ సేకరణ చేసే పని ఈ గ్రూప్లకు అప్పగించారు.
పొరపాటున తమ పేర్లు గ్రూప్లలో చేర్చారనీ, వాటిలో కొనసాగి విషయాన్ని ఇంకా సంక్లిష్టం చేయడం తమకు ఇష్టం లేదనీ సోనియా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో అన్నారు. ఈ రోజు రాత్రికే రాహుల్ వారసుడి ఎంపిక పూర్తవుతుందని భావిస్తున్నారు.