అమరావతి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు గతంలో అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోవడం తప్పేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయం పట్ల తాను చాలా విచారిస్తున్నానని చెప్పారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్, హాట్గా మొదలయ్యాయి. సభ ప్రారంభంకాగానే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడేందుకు ప్రయత్నించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రశ్నోత్తరాలను చేపట్టకుండా వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై టీడీపీ మండిపడింది. వంశీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని- టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది.
దీంతో చంద్రబాబు ఇదేం పార్టీ ఆఫీసు కాదు.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన స్పీకర్ తమ్మినేని ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని మండిపడ్డారు. ఆ తర్వాత స్పీకర్ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వల్లభనేని వంశీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అనంతరం స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ..అసెంబ్లీని వైసీపీ ఆఫీసన్న విపక్ష నేత చంద్రబాబు మాటలు వెనక్కి తీసుకోవాలని తెలిపారు. సభపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. అసెంబ్లీ ఎవరికీ జాగీరు కాదని… ప్రజల జాగీర్ మాత్రమేనని తెలిపారు. స్పీకర్ గా తనకున్న విచక్షణాధికారంతోనే ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడేందుకు వల్లభనేని వంశీకి అవకాశమిచ్చానని తమ్మినేని చెప్పారు. ‘గతంలో సభలో ఎన్టీఆర్కు అవకాశం ఇవ్వకపోవడం తప్పే.. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినే. అందుకు 15ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నా’ అని తమ్మినేని అన్నారు.