న్యూఢిల్లీ: గాంధీ కుటుంబసభ్యులకు కేంద్రం ఎస్పిజి భద్రత తొలగించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి ఇక మీదట జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత మాత్రమే ఉంటుంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గురించి వారికి ఇంకా తెలియపరచలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల జరిగిన ఒక సెక్యూరిటీ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఎన్డిటివి రిపోర్టు చేసింది. అత్యంత ముఖ్యుల భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ (ఎస్పిజి)ను వినియోగిస్తారు. జడ్ ప్లస్ క్యాటగిరీ కింద కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు ముఖ్యుల భద్రత చూస్తాయి. కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం దాదాపు వంద మంది సిఆర్పిఎఫ్ జవాన్లు గాంధీల భద్రత డ్యూటీలో ఉంటారు.
ఈ నిర్ణయం రాజకీయంగా దుమారం సృష్టించే అవకాశం ఉంది. తమ నాయకులకు సెక్యూరిటీ తగ్గించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించకపోవచ్చు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగిన దగ్గరనుంచీ ఆయన కుటుంబసభ్యులకు ఎస్పిజి భద్రత కల్పిస్తూ వచ్చారు.
దీనిపై స్పందిస్తూ, బిజెపి వ్యక్తిగత కక్షసాధింపు రాజకీయాలకు దిగిందని కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. భద్రత కుదించడం ద్వారా దేశం కోసం ప్రాణాలిచ్చిన ఇద్దరు మాజీ ప్రధాన మంత్రుల కుటుంబసభ్యుల ప్రాణాలను బిజెపి ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందని ఆయన పేర్కొన్నారు.