అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా వైసిపి ప్రభుత్వం చేపట్టిన లబ్దిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీసింది. పౌర సరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో జరిగిన తప్పిదానికి జగన్ ప్రభుత్వాన్ని నిందిస్తూ టిడిపి విమర్శలు చేస్తోంది. నాసిరకం బియ్యం పంపిణీ చేశారంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండగా మరి కొందరు తమకు నాణ్యమైన బియ్యం సంచులను గ్రామ వాలంటీర్ ఇంటికి తీసుకువచ్చి మరీ ఇచ్చారని చెబుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ రెండు రకాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ చేస్తుండగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.
సన్న బియ్యం అంటే సన్నగా ఉన్న వ్యక్తిని పౌరసరఫరాల శాఖకి మంత్రిగా చెయ్యడం మాత్రమే అని ఆలస్యంగా అర్థం చేసుకున్నామని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన బియ్యం అంటే మరీ ఇంత నాణ్యమైనవి అనుకోలేదు, పశువులు కూడా తినలేని బియ్యంలో వైసిపి మార్కు సంచుల దోపిడీ 750కోట్ల రూపాయలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
పేద వర్గాలకు గతంలో ఎన్నడూలేని విధంగా తినగలిగే నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తుంటే టిడిపి ఓర్వలేకపోతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. పంపిణీ చేసిన బియ్యం చాలా బాగున్నాయని కార్డుదారుల నుండి ఫీడ్బ్యాక్ వస్తోందని మంత్రి తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా అయిదు, పది,15,20,25 కేజీల చొప్పున ప్యాకింగ్ బియ్యం సంచులను కార్డుదారుల ఇళ్లకు నేరుగా సరఫరా చేశారు. అయితే పలు ప్రాంతాలకు సరఫరా అయిన బియ్యం తడితడిగా ఉండి ముద్దగా మారి వాసన వస్తుండటంతో కొందరు వాలంటీర్ను పిలిచి బియ్యం బ్యాగ్లను తిరిగి ఇచ్చారు. పొందూరు మండలం కేశవదాసుపురంలో లబ్దిదారులు నిరసన వ్యక్తం చేశారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల సమయంలో గోదాముల్లో నిల్వ చేసిన బియ్యంలో కింది బస్తాలు తడిసిపోయాయి. తడి అంటిన బస్తాలను అధికారులు గుర్తించకుండా పంపిణీ చేయడంతో సమస్య తలెత్తింది.
బియ్యం పంపిణీ పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం కలెక్టర్ జే నివాస్ తెలిపారు. 20 మంది లబ్దిదారుల నుండి తడిసిన బియ్యం పంపిణీ చేశారని ఫిర్యాదులు వచ్చాయని ఆయన చెప్పారు. నాసిరకం బియ్యం పొందిన వారు వాలంటీర్కు తిరిగి ఇచ్చేసి మళ్లీ కొత్తవి పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.
వర్షాల కారణంగా గోదాముల్లో చమ్మ వల్ల అడుగున ఉన్న బస్తాల్లోని బియ్యం పాడయ్యే అవకాశం ఉంది. 80 శాతంకుపైగా లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా జరిగినట్లు తెలుస్తోంది.పేదలకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తే కూడా టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారనీ వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శించారు. మూడు పూటలా ఇసుక బొక్కినోళ్లకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుసు అని ఆయన ప్రశ్నించారు. నాణ్యమైన బియ్యం పంపిణీ చేసిన గంట లోపే పచ్చదొంగలు క్షుద్ర దాడి మొదలు పెట్టారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.