ఇరాన్: అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిం సులేమానీ అంతిమ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సులేమానీ అంత్యక్రియలు మంగళవారం కెర్మన్ పట్టణంలో జరిగాయి. అంతిమయాత్రలో సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 మంది మరణించగా.. మరో 50 మంది వరకు గాయపడ్డారు. సులేమానీ స్వస్థలమైన కెర్మాన్లో నిర్వహించిన సులేమానీ అంతిమయాత్రకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. దాంతో తొక్కిసలాట ఏర్పడడంతో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్ వెల్లడించింది.
లక్షలాది మంది ప్రజలు ఇరాన్ జాతీయ జెండాలు, సులేమానీ ఫొటోలతో కెర్మాన్ వీధుల్లోకి వచ్చిన దృశ్యాలను ఇరాన్ జాతీయ చానల్ ప్రసారం చేసింది. కెర్మాన్లో నిర్వహించిన సులేమానీ అంతిమయాత్రలో పాల్గొన్న వారంతా నలుపు దుస్తుల్లో నిరసన తెలిపారు. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు నినాదాలు చేశారు. సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో నిర్వహించిన సులేమానీ భౌతిక కాయ ఊరేగింపులోనూ లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు.
ఇరాక్లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జనవరి 3న అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్, ఖుద్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సులెమానీ, ఇరాక్ మిలీషియా నేత అబు మహదీ అల్ ముహందీస్ మృతిచెందిన సంగతి తెలిసిందే. సులేమానీ హత్యుకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు. ఖుద్స్ ఫోర్స్ నూతన చీఫ్గా.. సులేమానీ స్థానంలో ఇస్మాయెల్ ఖానీని నియమించారు.
సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి తమ వద్ద 13 ప్లాన్లు ఉన్నాయని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ షంఖానీ తెలిపారు. అమెరికా బలగాలు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లకపోతే.. వారి శరీర భాగాలను నిలువునా చీలుస్తామని హెచ్చరించారు. అమెరికా బలగాలను ఉగ్రవాదులుగా గుర్తించే బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇరాక్ పార్లమెంటు సైతం విదేశీ సైనికులను దేశం నుంచి పంపేయాలని తీర్మానం చేసింది.
మరోవైపు తమపై దాడికి ప్రయత్నిస్తే ఇరాన్ వారసత్వ, చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని చెప్పారు. దీంతో మరోసారి మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.