ఉత్తరప్రదేశ్: బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థిని ఆచూకీ దొరికింది. ఆమె రాజస్థాన్ లో ఉన్నట్లు గుర్తించారు. స్వామి చిన్మయానంద్ తనపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ న్యాయ విద్యార్థిని ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. తన ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అనంతరం విద్యార్థిని అదృశ్యమైంది. స్వామి చిన్మయానంద్ తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ.. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో చిన్మయానంద్ పై కేసు నమోదు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో స్వామి సుఖదేవానంద న్యాయ కళాశాలలో బాధిత విద్యార్థిని చదువుతున్నారు. అదే కళాశాలకు చెందిన హాస్టల్ లో ఉంటున్నారు. స్వామి చిన్మయానంద్ ఇదే కళాశాలకు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. చిన్మయానంద్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, తరచూ శారీరకంగా హింసిస్తున్నారని, దీన్ని వీడియో తీసి బెదిరిస్తున్నారని, తనను రక్షించాలని కోరుతూ బాధిత విద్యార్థిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ లకు విన్నవించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె ఈ నెల 23వ తేదీన తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది.