లక్నో: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై అత్యాచారం ఆరోపణలు చేసిన లా విద్యార్థినిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. చిన్మయానంద్ ను డబ్బులు కోసం బెదిరించిన కేసులో ఆమెను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ న్యాయవిద్యార్థిని కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు గురువారం దర్యాప్తు చేయనుండగా బుధవారం ఆమెను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ సిట్ పోలీసులు లా విద్యార్థినిని ప్రశ్నించనుంది.
మరోవైపు న్యాయవిద్యార్థిని స్నేహితులైన సంజయ్, సచిన్, విక్రంలపై చిన్మయానంద్ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదుతో వారిని సిట్ అరెస్టు చేసింది. చిన్మయానంద్ నుంచి డబ్బు వసూలు కోసం ఫోన్ లో బెదిరించారనే ఆరోపణలపై పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. చిన్మయానంద్ కేసుతో పాటు బాధితురాలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే మరో కేసు నమోదు కావడంతో ఈ కేసు మలుపు తిరిగింది.
Shahjahanpur: The law student, who had accused Swami Chinmayanand for sexually harassing her, being brought to District Jail after a local court sent her to 14-day judicial custody for allegedly trying to extort money from him. pic.twitter.com/lq8xW85OrU
— ANI UP (@ANINewsUP) September 25, 2019
అత్యాచారం కేసులో సెప్టెంబర్ 20న బీజేపీ నేత స్వామి చిన్మయానంద్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఉత్తరప్రదేశ్ లో చిన్మయానంద్ పలు ఆశ్రమాలు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. షాజహాన్పూర్లోని ఎస్ఎస్ న్యాయ కాలేజీకి చెందిన 23 ఏళ్ల లా స్టూడెంట్.. చిన్మయానంద్ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడంటూ ఆరోపణలు చేసింది. తన కాలేజీలో ఆడ్మిషన్ ఇప్పిస్తానని చెప్పి ఈ దారుణానికి పాల్పడినట్టుగా ఆమె ఆరోపించింది. గత ఆగస్ట్ 24న ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన చిన్మయానంద్.. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాది పాటు లైంగికదాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తుపాకీతో బెదిరించి తన చేత బలవంతంగా మసాజ్ కూడా చేయించుకున్నాడని సదరు లా విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్మయానంద్ తనపై అత్యాచారానికి పాల్పడిన సమయంలో బాధితురాలు తాను ధరించిన కళ్లజోడులో రహస్యంగా బిగించిన కెమెరా ద్వారా ఈ దృశ్యాలను రికార్డు చేసింది. ఆ సాక్ష్యాలను సిట్ అధికారులకు అందజేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బాధిత విద్యార్థినితోపాటు చిన్మయానంద్ ను విచారించారు. అయితే, అప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయకపోవడంతో పోలీసుల తీరుపై బాధితురాలు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాను చనిపోతేగానీ చిన్మయానంద్ పై కేసు పెట్టరేమెనని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిన్మయానంద్ ను సెప్టెంబర్ 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా డబ్బులు గుంజేందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందనే ఆరోపణలపై బాధితురాలని కూడా అరెస్ట్ చేశారు.