(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శ తగలాల్సిన చోట తగిలినట్లుంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. ఎవరైనా గానీ తమ సొంత అభిప్రాయాలను వ్యాప్తి చేయడం కన్నా సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం మంచిదని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
శనివారం ఒక కార్యక్రమంలో రాహుల్ బజాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వంపై కార్పొరేట్ రంగంలో నమ్మకం సడలిందని అన్నారు. యుపిఎ – 2 హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎవరూ భయపడేవారు కాదనీ, ఇప్పుడు నరేంద్ర మోదీని విమర్శించేందుకు దడుస్తున్నారనీ కూడా ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బజాజ్ మాటలు వెంటనే వైరల్ అయ్యాయి.
దీనికి అమిత్ షా స్పందిస్తూ, దేశంలో ఒక రకమైన వాతావరణం ఉందని మీరు అంటున్నారు. అలాంటప్పుడు దానిని మార్చేందుకు ప్రయత్నించాల్సిందే అన్నారు. మూకదాడులపై తగిన విధంగా చర్యలు లేవని పేర్కొంటూ, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గాడ్సేని కీర్తించడాన్ని కూడా రాహుల్ బజాజ్ తన ప్రసంగంలో ఎత్తిచూపారు.
అమిత్ షా సమక్షంలోనే రాహుల్ బజాజ్ ఈ వ్యాఖ్యలు చేయడమే దేశంలో ఎంత స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొన్నదో చెబుతున్నదని పౌర విమానయాన శాఖ మంత్రి హరదీప్ సింగ్ పురి వ్యాఖ్యానించారు. పీయూష్ గోయల్ కూడా ఇదే మాట అన్నారు.
రాహుల బజాజ్ మాటలకు మంత్రులు ఈ విధంగా స్పందిస్తే బిజెపి ఐటి విభాగం ఆయనను కాంగ్రెస్ మనిషిగా చిత్రించే యత్నం చేసింది. బిజెపి ఐటి విభాగం ఇన్ఛార్జి అమిత్ మాలవీయ రెండు వీడియోలు పోస్టు చేశారు. వాటిలో రాహుల్ బజాజ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనీ పొగుడుతున్నట్లు ఉంది. ఒక వీడియోను ట్యాగ్ చేస్తూ, రాహుల్ గాంధీనీ తప్ప ఎవరినీ నేను పొగడలేను అని రాహుల్ బజాజ్ చెబుతున్నారు. రాజకీయంగా మీరు ఎవరిపక్కనున్నారో బహిరంగంగా చెప్పుకోండి. అంతేకానీ దేశంలో ఏదో రకమైన వాతావరణం ఉందన్న మాటల వెనక దాక్కునేందుకు ప్రయత్నించకండి అని ట్వీట్ చేశారు.