(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: రాజధానిని మారిస్తే రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్చడం అంటే కారు మార్చినంత సులువు కాదని వ్యాఖ్యనించారు. జిఎన్ రావు కమిటీ తలాతోక లేని నివేదిక ఇచ్చిందని సుజనా విమర్శించారు. మూడు రాజధానులు అనేది హాస్యాస్పదమని అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.అమరావతి పేరిట గత ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేసింది, వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న వారు కోర్టును ఆశ్రయిస్తే రెండు లక్షల కోట్ల రూపాయల వరకూ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుజనా తెలిపారు. రోజూ కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉన్నా జగన్ ప్రభుత్వంలో మార్పు రావడం లేదన్నారు.
రాజధాని నిర్మాణంలో ఆలస్యం జరిగిన విషయం వాస్తవమేననీ, ఆ కారణంగానే రాజధానిలో తెలుగుదేశం పార్టీని ఓడించారని ఆయన అన్నారు. అమరావతిలో ఎన్నో భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అమరావతిలో కేంద్రానికి చెందిన 130 సంస్థలకు భూముల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఇప్పటికే రాజధానికి పలు విద్యాసంస్థలు వచ్చాయని సుజన గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు అనేకం ఉన్నాయని విమర్శించారు. వైసిపి అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లో రాజధానిలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఇతర సంస్థలు నెలకొల్పాలని సూచించారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి జరగదని సుజనా చౌదరి పేర్కొన్నారు.
ఇది ఒక్క అమరావతి సమస్య మాత్రమే కాదనీ, 13 జిల్లాల ప్రజలు ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉందనీ సుజనా అన్నారు. వైసిపి ప్రభుత్వ ఈ అరాచకన చర్యలను అడ్డుకోకపోతే 13 జిల్లాల్లోని అయిదు కోట్ల మంది ఆంధ్రులు భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. రాష్ట్రం బనానా రిపబ్లిక్లా కూదేలు పడిపోతుందనీ సుజనా హెచ్చరించారు. భావితరాలకు ఉద్యోగాలు రావు, రోడ్లు ఊడవటానికి కూడా డబ్బులు ఉండవు, జీతాలు ఇవ్వడానికి డబ్బు ఉండవని తెలిపారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై తన ఛాలెంజ్కు సమాధానం లేదని అన్నారు.ఇన్సైడర్ ట్రేడింగ్పై సిబిఐ విచారణ అంటున్నారు, రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థ సిఐడి అసమర్థమైందనా అని ప్రశ్నించారు.’నా సంస్థలపై సీబీఐ సోదాలు, అన్ని తనిఖీ చేసింది. ఏమీ నిరూపించలేక పోయారు’ అని చెప్పారు. ఆర్థిక నష్టాలు వేరు, ఆర్ధిక నేరాలు వేరన్నారు. విజయసాయిరెడ్డికి ఆర్ధిక నేరాలు మాత్రమే తెలుసునని సుజనా విమర్శించారు.