ఢిల్లీ: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. తన తండ్రి వివేకా హత్య కేసు దర్యాప్తును సక్రమంగా జరిగేలా చూడాలని సిఇసిని కోరారు. సిఇసి కేసు దర్యాప్తు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. సిట్ కేసు దర్యాప్తు చేస్తున్నా పత్రికల్లో వివిధ రకాలుగా కథనాలు రావడం తమను బాధకల్గిస్తుందని సునీతారెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో కేసు దర్యాప్తుపై వ్యక్తమవుతున్న విషయాలు పత్రికల్లో రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
గురువారం అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అదికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఇదే విషయంపై వినతి పత్రాన్ని అందించారు. కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా జరిపి నిజమైన దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం సిఇసికి వినతి పత్రాన్ని అందించి కేసు దర్యాప్తు తీరును సునీతా రెడ్డి వివరించారు.
అనంతరం సునీతా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…‘మా నాన్న హత్యకేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరాం. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఎప్పటికప్పుడు, డీజీపీ, సీఎం చంద్రబాబుకు వివరాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రే తప్పుగా ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా మా నాన్నహత్యను వాడుకోవాలని చూస్తున్నారు.’ అని అన్నారు.
సిట్ అధికారులు దర్యాప్తు నివేదిక బయట పెట్టకపోయినా మా కుటుంబ సభ్యులే ఇదంతా చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారని సునీతా రెడ్డి అన్నారు.
కేసు దర్యాప్తుకు సంబంధించి కేంద్ర హోంశాఖను కలవాలని సిఇసి సూచించారని, వారి సూచనల మేరకు కేంద్ర హోంశాఖను కలిసి విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరతామని సునీతా రెడ్డి తెలిపారు.
వివేకా హత్య ఘటనపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్గా చేసి విమర్శలు చేస్తుండగా జగన్మోహనరెడ్డి వర్గీయులే హత్యకేసును నీరు గార్చేందుకే సాక్షాధారాలను మాయం చేశారని, తొలుత హత్యను కూడా దాయాలని చూసి గుండెపోటు అని చెప్పారని, సిట్ దర్యాప్తులో దోషులు ఏవరో తేలుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో తమకు నమ్మకం లేదని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ చేయాలని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై హైకోర్టులోనూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సిట్ దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతోనే సిబిఐ దర్యాప్తును కోరుతున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే సిట్ అదికారులు వివేకా హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు. అనుమానుతలను కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలపై సిట్ అధికారులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. సిసి కెమెరా పుటేజీ ఆధారంగా పలు విషయాలను రాబట్టినట్లు తెలుస్తుంది.
దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి పులివెందులలో ఈ నెల 15వ తేదీన హత్యకు గురయ్యారు.