అమరావతి: రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ రైతులు, మహిళలు ఆందోళన చేస్తుంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నోరు మెదపడం లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అమరావతిలో శుక్రవారం మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా శనివారం మందడంలో రైతులకు చేస్తున్న ధర్నాకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ లో స్టూడియోల నిర్మాణానికే సీఎం జగన్ తో చిత్ర పరిశ్రమ లాలూచీ పడిందని ఆమె ఆరోపించారు. తమిళనాడు జల్లికట్టు ఉద్యమానికి తమిళ సినీ పరిశ్రమ అంతా తరలివస్తే.. అమరావతి రాజధాని ఆందోళన తెలుగు సినీ పరిశ్రమకు పట్టదా అని ప్రశ్నించారు. 13 జిల్లాల ప్రజలంతా సినిమాలు చూడడం మానేస్తేకాని చిత్ర పరిశ్రమకు చలనం రాదని పేర్కొన్నారు. రైతులన్నా, మహిళలంటే చిత్ర పరిశ్రమకు గౌరవం లేదు విమర్శించారు. ప్రజలు సినిమాలు చూస్తుంటే వారికి డబ్బులొస్తున్నాయి కాబట్టి సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. ప్రజల కోసం తరలిరాని చిత్రపరిశ్రమను నెలరోజులు బాయ్ కాట్ చేయాలని సుంకర పద్మశ్రీ పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ తరలివచ్చేలా సోషల్మీడియాలో ప్రతిఒక్కరూ చిత్రపరిశ్రమపై ఒత్తిడి తేవాలని చెప్పారు. శుక్రవారం మహిళలపై పోలీసుల దాడి అమానుషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేసి పోరాటంలో పాల్గొనాలని సూచించారు. రాజీనామా చేసి వచ్చే ప్రజాప్రతినిధులను తిరిగి గెలిపించుకొనే బాధ్యత తమదని చెప్పారు. తనను చంపేసినా పర్వాలేదు.. అమరావతిలోనే రాజధానిని ఉంచాలని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.
previous post