న్యూఢిల్లీ: గర్భం ఉంచుకోవాలో, తీసేసుకోవాలో నిర్ణయించునేందుకు మహిళలకున్న హక్కును చట్టబద్ధం చేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. స్వాతీ అగర్వాల్, గరిమా సక్సెరియా, ప్రాచీ వాట్ అనే మహిళలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లోని అంశాలపై స్పందించాల్సిందిగా కోరుతూ కోర్టు కేంద్రప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
గర్భం ధరించాలా వద్దా, దానిని పూర్తికాలం మోయాలా లేక మధ్యలో తొలగించాలా అని తేల్చుకునే హక్కు పిల్లలను కనాలో వద్దో తేల్చుకునేందుకు మహిళలకున్న హక్కులో భాగమేనని పిటిషన్లో పేర్కొన్నారు. మహిళకు సంబంధించి గోప్యత, గౌరవం, వ్యక్తిగత స్వయంప్రతిపత్తి, నిర్ణయాలు తీసుకునే హక్కు, తన శరీరంపై తనకున్న హక్కు, ఆరోగ్య పరిరక్షణ హక్కు..ఆర్టికల్ 21 కింద రాజ్యాంగ రక్షణ ఉన్న ఈ అంశాలన్నీ అందులో భాగమని పిటిషన్దారులు వాదించారు.
వైద్యపరంగా గర్భవిచ్చిత్తి చట్టం 1971లోని అనేక నిబంధనలు పిల్లల్ని కనాలో వద్దో తేల్చుకునేందుకు మహిళలకున్న హక్కుపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని, శరీరంపై ఉన్న హక్కునూ ఈ నిబంధనలు కాలరాస్తున్నాయని పేర్కొన్నారు.