న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాఖలయిన కోర్టు ధిక్కారం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి రఫేల్ కేసులో చౌకీదార్ చోర్ హై అన్న తన నినాదాన్ని సుప్రీంకోర్టుకు ఆపాదించినందుకు రాహుల్పై ఈ కేసు దాఖలయింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసు విచారించింది. రాహుల్ గాంధీ క్షమాపణను స్వీకరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. రాహుల్ ముందే బేషరతుగా క్షమాపణ చెప్పని కారణంగా కేసు ఇక్కడివరకూ వచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. భవిష్యత్తులో రాహుల్ జాగ్తత్తగా ఉండాలని కోర్టు హెచ్చరించింది.
బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి రాహుల్పై ఈ కేసు దాఖలు చేశారు. కేసులో రాహుల్ మొదట దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్ పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో రాహుల్ తన తప్పును నేరుగా ఒప్పుకోకపోవడం అందుకు కారణం. దానితో రాహుల్ బేషరతుగా క్షమాపణ చెబుతూ రెండవ అఫిడవిట్ దాఖలు చేశారు.