న్యూఢిల్లీ: తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ కేసు దోషి ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అన్ని పత్రాలు చూసిన తర్వాతే రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనపై నిర్ణయం తీసుకున్నారని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జైల్లో దోషి ఎదుర్కొన్న బాధను ఆధారంగా చేసుకుని క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయడం సరైందని కాదని, కేవలం జైల్లో వేధించారన్న కారణంగా రాష్ట్రపతి నిర్ణయాన్ని సమీక్షించలేమని పేర్కొంది. క్షమాభిక్షను వేగంగా తిరస్కరించడం అంటే దానర్ధం ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం కాదని తెలిపింది.
ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు నిర్భయ దోషులను ఉరితీయాలని ట్రయల్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. దీంతో దోషుల్లో ఒకరైన ముకేశ్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు. అయితే, ముకేశ్ అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ముకేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని అత్యవసరంగా విచారణకు చేపట్టిన న్యాయస్థానం.. మంగళవారం(జనవరి 28) వాదనలు విన్నది. ముకేశ్ తరపున సీనియర్ న్యాయవాది అంజనా ప్రకాశ్, ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా.. ముకేశ్ జైల్లో అత్యాచారానికి గురయ్యాడని అతడి తరఫు లాయర్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ వాదనను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు. జైల్లో దోషి పడిన బాధను క్షమాభిక్ష కింద పరిగణనలోకి తీసుకోరని చెప్పారు. ముకేశ్ మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ముకేశ్ పిటిషన్ ను కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. పిటిషన్ లో ముఖేశ్ కుమార్ పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్రపతికి అన్ని డాక్యుమెంట్లు పంపించలేదనే ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వారి పట్ల జాలి చూపించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
మరోవైపు నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు శిక్ష అమలు వాయిదా పడేలా దోషులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో మరోదోషి అక్షయ్ కుమార్ సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పటికే ఇద్దరు దోషుల పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉరిశిక్ష అమలుకు నాలుగు రోజుల ముందు మంగళవారం(జనవరి 28) రాత్రి అక్షయ్ తన చిట్టచివరి న్యాయపరమైన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఉరిశిక్షను సవాల్ చేస్తూ అతడు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. గతంలో అక్షయ్ వేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజా క్యూరేటివ్ పిటిషన్ పై న్యాయమూర్తులు బుధవారం ఛాంబర్లలో విచారణ జరిపే అవకాశం ఉంది. ఉరిశిక్ష అమలుకు తేదీ దగ్గరపడుతున్న సమయంలో దోషులు ఇలా పిటిషన్లు వేయడంతో ఫిబ్రవరి 1న ఉరి అమలు అవుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.