(న్యూస్ అర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో నిరవధికంగా మొబైల్ సేవలు నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఆగస్టులో నిర్వీర్యం చేసిన నాటినుంచీ అక్కడ మొబైల్ సేవలు నిలిపివేశారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దాఖలయిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిచింది.
జమ్ము కశ్మీర్లో మొబైల్ సేవలు నిలిపివేసిన ఉత్తర్వులను వారం లోగా సమీక్షించాలని జస్టిస్ ఎన్.వి. రమణ తన తీర్పులో కేంద్రాన్ని ఆదేశించారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ రమణతో పాటు జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ బిఆర్ గవాయ్ సభ్యులుగా ఉన్నారు.
భావప్రకటన స్వేచ్ఛలో ఇంటర్నెట్ సదుపాయం కూడా భాగమేనని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఆ విధంగా ఇంటర్నెట్ సదుపాయానికి ఆర్టికల్ 19 కింద రక్షణ లభిస్తుందని కోర్టు పేర్కొన్నది. కశ్మీర్లో మొబైల్ సేవలు, ఇంటర్నెట్ సదుపాయం రద్దు చేస్తున్న ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు ముందు ఉంచేందుకు కూడా కేంద్రం నిరాకరించింది. వెంటనే అన్ని ఉత్తర్వులనూ ప్రజల ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పౌరులు ఆ ఆదేశాలను హైకోర్టులలో సవాలు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.