న్యూఢిల్లీ: బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను బయట పెట్టాలని రిజర్వు బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద విడుదల చేసే విషయంలో బ్యాంకు విధానాలను ఓసారి సమీక్షించుకోవాలని జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. అయితే రిజర్వు బ్యాంకు మీద కోర్టు ధిక్కార చర్యలు మాత్రం ఏమీ ప్రారంభించలేదు. కానీ భవిష్యత్తులో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్లు తెలిస్తే మాత్రం దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ సంవత్సరం జనవరిలో మాత్రం ఒకసారి కోర్టు ఆర్బీఐకి కోర్టు ధిక్కార నోటీసు పంపింది.
సుభాష్ చంద్ర అగర్వాల్ దాఖలుచేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఆర్బీఐ, దాని మాజీ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఆర్టీఐ కింద అడిగిన సమాచారం ఇవ్వడం లేదని తమ పిటిషన్ లో తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలలో 2011 ఏప్రిల్ నుంచి 2015 డిసెంబర్ వరకు జరిగిన తనిఖీల నివేదికలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా అందుకు ఆర్బీఐ నిరాకరించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45ఎన్.బి., ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(ఈ) కింద తమకు మినహాయింపు ఉందని ఆర్బీఐ తెలిపింది. కానీ దాన్ని సుప్రీంకోర్టు తన తాజా ఆదేశాలలో తోసిపుచ్చింది. నివేదికలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.