కమిటీ సభ్యులు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై ఒక ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదును ఏ విధంగా పరిష్కరించిందీ చెప్పే సమాచారం ప్రజలతో పంచుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద వచ్చిన విజ్ఞప్తులను సుప్రీంకోర్టు తిరస్కరించిందని ద వైర్ వెబ్సైట్ తెలిపింది.
జస్టిస్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను విచారించేందుకు జస్టిస్ బాబ్డే నేతృత్వంలో జస్టిస్ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ సభ్యులుగా ముగ్గురు సభ్యుల కమిటీ నియమించారు. వారిలో జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తి గొగోయ్కి సన్నిహితుడని ఫిర్యాదుదారు పేర్కొనడంతో జస్టిస్ రమణ కమిటీ నుంచి వైదొలగారు. ఆయన స్థానంలో జస్టిస్ ఇందు మల్హోత్రాను నియమించారు. ఈ కమిటీ ఫిర్యాదుదారు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదంటూ జస్టిస్ గొగోయ్కు క్లీన్చిట్ ఇచ్చింది.
ఆర్టిఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ ఈ కమిటీకి సంబంధించిన సమాచారం కోరారు. బాబ్డే కమిటీని నియమించిన తీర్మానం కాపీ, జస్టిస్ ఇందు మల్హోత్రాను కమిటీలో సభ్యురాలిగా చేర్చేందుకు చేసిన తీర్మానం కాపీ, కమిటీ పని కోసం రూపొందించిన మార్గదర్శకాలు, పరిశీలనాంశాలు, నిబంధనల కాపీ, కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన తేదీ అందించాల్సిందిగా భరద్వాజ్ సుప్రీంకోర్టును కోరారు. అందుకు ఆమె నవంబర్ 30న విజ్ఞప్తి దాఖలు చేశారు.
దానికి బదులిచ్చిన సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్, ప్రధాన ప్రజా సమాచార అధికారి అజయ్ అగర్వాల్, మొదటి రెండు ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం, నమ్మకంతో కూడిన సంబంధం, గోప్యత హక్కు, రహస్యాలు కాపాడాల్సిన బాధ్యత మొదలగు కారణాలతో ఇవ్వలేమని తెలిపారు. కమిటీ పరిశీలనాంశాలకు సంబంధించి లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినపుడు అంతర్గత విచారణకు సుప్రీంకోర్టు అవలంబించే పద్ధతి న్యాయస్థానం వెబ్సైట్లో ఉందని పేర్కొన్నారు.
నాలుగవ ప్రశ్నకు సంబంధించి జస్టిస్ బాబ్డే కమిటీ 2019 మే నెల అయిదవ తేదీన తదుపరి సీనియర్ న్యాయమూర్తికి నివేదిక సమర్పించిందని అగర్వాల్ తెలిపారు. జస్టిస్ గొగోయ్పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కమిటీ తేల్చినట్లు కూడా తెలిపారు. ఇందిరా జైసింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు కేసులో సుప్రీంకోర్టు ఖరారు చేసిన అంతర్గత విచారణ ప్రక్రియ నిబంధనల ప్రకారం కమిటీ నివేదికను బహిరంగం చేయడం లేదని అగర్వాల్ తెలిపారు.
అంజలీ భరద్వాజ్ ఆర్టిఐ విజ్ఞప్తికి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన జవాబు
సుప్రీంకోర్టు అంతర్గత విచారణ ప్రక్రియ నిబంధనలు వెబ్సైట్లో ఉన్నమాట వాస్తవమే. అయితే ఆరోపణలు ప్రధాన న్యాయమూర్తిపైనే వచ్చినట్లయితే ఏం చెయ్యాలన్న దానిపై ఆ నిబంధనలు ఏమీ చెప్పడం లేదని అంజలీ భరద్వాజ్ వైర్తో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జవాబుపై త్వరలో అప్పీలుకు వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. ఇది చాలా అన్యాయమైన కేసు. ఆ మహిళా ఉద్యోగి ప్రధాన న్యాయమూర్తిపై ఫిర్యాదు ఇచ్చిన దగ్గరనుంచీ ఆమెను వేధించిన తీరు, ఆమె ఫిర్యాదుపై సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి స్పందించిన తీరు, అంతా గూఢంగా జరిగింది అని భరద్వాజ్ పేర్కొన్నారు. ఇలాంటి సంచలనం సృష్టించిన కేసులో సమాచారం ఇవ్వడానికి నిరాకరించడం వల్ల సుప్రీంకోర్టు విశ్వసనీయత దెబ్బ తింటుంది అని భరద్వాజ్ పేర్కొన్నారు.
జస్టిస్ బాబ్డే కమిటీ ఏర్పాటయిన తర్వాత అది వ్యవహారిస్తున్న తీరు సరిగా లేదని పేర్కొంటూ ఫిర్యాదుదారు కమిటీ ముందుకు వచ్చేందుకు నిరాకరించారు. ఫిర్యాదుదారును విచారించకుండా నివేదిక రూపొందించడం మంచిది కాదని పేర్కొంటూ మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కమిటీకి లేఖ రాశారని గత మే నెలలో ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తెలిపింది. ఈ లేఖ ప్రతి కావాలని కోరుతూ భరద్వాజ్ ఆర్టిఐ కింద మరో విజ్ఞప్తి ఇచ్చారు. దానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ చంద్రచూడ్ లేఖ రికార్డులో లేదని తెలిపింది.
జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ రోహింటన్ నారిమన్ కలిసి మే మూడవ తేదీన కమిటీని కలిశారని కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తెలిపింది. రెండు రోజుల తర్వాత సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో వారిద్దరూ కమిటీని కలిసినట్లు వచ్చిన వార్త నిజం కాదని తెలిపింది. అయితే జస్టిస్ చంద్రచూడ్ లేఖ రాసిన విషయాన్ని ఆ ప్రకటనలో ఖండించలేదు. అంటే జస్టిస్ చంద్రచూడ్ లేఖ రాసిన విషయాన్ని కోర్టు అన్యాపదేశంగా ఒప్పుకుంది. మరి అంజలీ భరద్వాజ్ విజ్ఞప్తికి జవాబుగా లేఖ రికార్డులో లేదని ఎందుకు చెప్పిందీ తెలియదు.