రఫేల్ ఒప్పందంపై అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు
కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన మీనాక్షి లేఖి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై ప్రధాని నరేంద్రమోద మీద చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖి పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిపై ఈనెల 22వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని ఆదేశించింది. రఫేల్ ఒప్పందంలో ‘చౌకీదారు’ (మోదీని ఉద్దేశించి) దొంగ అని రాహుల్ అనడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును ఉద్దేశించి అన్నట్లుందని కోర్టు చెప్పింది. ప్రధానమంత్రి మోదీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి సందర్భం ఏమీ లేదని, రఫేల్ ఒప్పందానికి సంబంధించి కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసిన కొన్ని పత్రాలపై విచారణకు అంగీకరించాలా వద్దా అన్న విషయాన్ని తాము నిర్ణయిస్తున్నామని కోర్టు తెలిపింది.
ప్రధాని మోదీ రఫేల్ ఒప్పందంలో డబ్బులు దొంగిలించి, వాటిని అనిల్ అంబానీకి ఇచ్చినట్లు సుప్రీంకోర్టు కనుగొందని రాహుల్ గాంధీ పలు సందర్భాలలో అన్నారు. తాము అలా అననప్పుడు రాహుల్ ఎందుకు కోర్టు పేరు ప్రస్తావించాల్సి వచ్చిందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. రఫేల్ ఒప్పందంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు పేరును ప్రస్తావించారని, దాన్నిబట్టి ఆయనకేదో దురుద్దేశం ఉన్నట్లుందని బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖి తన పిటిషన్ లో ప్రస్తావించారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించి, కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని అన్నారు. కోర్టు ఉత్తర్వుల గురించి రాహుల్ గాంధీ తప్పుగా ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు కూడా మీడియా ద్వారా చూసే ఉంటుందని ఆమె మీడియాతో చెప్పారు.