(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు ముగ్గురు సభ్యులతో ఎంక్వైయిరీ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్పై గురువారం వాదనలు ముగిసాయి.
దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు ఉన్నతాధికారులతోనూ దర్యాప్తును చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీం కోర్టుకు విన్నవించారు. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని అనుకుంటే ఎన్ హెచ్ ఆర్ సి, హైకోర్టు విచారణ తక్షణమే నిలిపివేయాలని ముకుల్ రోహత్గి కోరారు.
ఎన్కౌంటర్పై నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొన్నది. వివిధ కోర్టుల్లో జరుగుతున్న విచారణపై సుప్రీం కోర్టు ఆరు నెలల పాటు స్టే విధిస్తూ ముగ్గురు సభ్యులతో జ్యూడీషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. .
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విఎస్ సిర్పూరక్ నేతృత్వంలో ఈ జ్యూడీషియల్ కమిటీ విచారణ జరుపుతుందని తెలిపింది. ఈ కమిటీ హైదరాబాద్లోనే ఉండి దర్యాప్తును చేయాలని సూచిస్తూ విచారణ ప్రారంభించిన తేదీ నుండి ఆరు నెలల్లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఈ కమిటీలో జస్టిస్ విఎస్ సిర్పూరక్తో పాటు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రసాద్, సిబిఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ ఉన్నారు.
దిశ హత్య కేసులో నిందితులైన నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఘటనా ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లగా, వారు తిరగబడ్డారనీ, ఆత్మ రక్షణ కోసం వారిని చంపాల్సి వచ్చిందనీ పోలీసులు తెలిపారు. అయితే, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని కొందరు మానవ హక్కుల ఉద్యమ కారులు తెలంగాణ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.
దిశా నిందితుల ఎన్కౌంటర్పై జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈ కేసులో నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారనీ, ఈ ఘటనపై విచారణ జరిపించాలనీ పిటిషన్లో వారు కోరారు.