న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్ధితులు వివరించనున్నారు. ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆరోజు పరిస్ధితులు ఏమిటి అనే విషయాలను సజ్జనార్ కోర్టుకు వివరిస్తారు.
దిశా నిందితుల ఎన్కౌంటర్పై జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందంతో విచారణ జరిపించాలని కోరారు. దీంతో.. సుప్రీం కోర్టు తమ ఎదుట హాజరు కావాలని సీపీ సజ్జనార్ను ఆదేశించింది. ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. కోర్టు ముందు హాజరై ఎన్కౌంటర్పై వివరణ ఇవ్వనున్నారు. కాగా, డిసెంబర్ 6న దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.