న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు కేసులో 2.77 ఎకరాల వివాద స్థలంపై యాజమాన్య హక్కులు బాల రాముడికి అప్పగించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వివాద స్థలంపై తమకు హక్కులు ఉన్నాయన్న వాదనను ముస్లింలు నిరూపించలేకపోయారని పేర్కొన్నది. అయితే ముస్లింలకు కట్టడం లేకుండా చేయలేమని కోర్టు తెలిపింది. అయోధ్యలోనే వివాదస్థలం వెలుపల ముస్లింలకు అయిదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రప్రభుత్వం కానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ భూకేటాయింపు జరుపుతాయి.
అయోధ్య వివాదంపై 1945 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. నిర్మోహీ అఖాడా దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు తోసేపుచ్చింది. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే అయిదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
బాబర్ కాలంలోనే బాబరీ మసీదు నిర్మాణం జరిగిందనీ, అయితే కట్టింది ఆ రాజు కాదనీ సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆయన సైనికాధికారులు బాబరీ మసీదు నిర్మించారు. అక్కడ ఉన్నది మసీదా లేక ఆలయమా అన్నది నిర్ధారించేందుకు కూడా ఆధారాలు లేవని సుప్రీం కోర్టు పేర్కొన్నది. వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేసేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజు చేసేవారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. 1949 డిసెంబర్లో అక్కడ చివరిసారి నమాజు చేశారని ధర్మాసనం పేర్కొన్నది.