ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్యథాకరే, రోహిత్ పవార్ లు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. తిరుగుబాటు చేసి మళ్లీ సొంత గూటికి వచ్చిన అజిత్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు. శివసేన నాయకుడు ఆదిత్యఠాక్రే బుధవారం ఉదయం సిద్ధివినాయక దేవాలయంలో పూజలు చేసిన అనంతరం అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
అంతకు ముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. సభ ప్రారంభానికి ముందే అసెంబ్లీకి చేరుకున్న ఎన్సీపీ నేత సుప్రియా సూలే, పలువురికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇక సొంత గూటికి చేరిన అజిత్ పవార్ ని సోదరి సుప్రియా సూలే ఆప్యాయంగా పలకరించారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో మర్యాద పూర్వకంగా కరచాలనం చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం కనిపించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే వద్దకు వెళ్లి పలకరించారు. ఎమ్మెల్యేలతో కలిసి కలివిడిగా తిరుగుతూ కనిపించారు సుప్రీయా.
#WATCH NCP leader Supriya Sule welcomed Ajit Pawar and other newly elected MLAs at #Maharashtra assembly, earlier today. #Mumbai pic.twitter.com/vVyIZfrl1x
— ANI (@ANI) November 27, 2019
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుప్రీయా సులే.. సంకీర్ణ ప్రభుత్వంపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటామన్న నమ్మకం ఉందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్ అఘాడీ’కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. నవంబర్ 28న ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.