(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో వ్యక్తిగత సమాచారానికి సరైన భద్రత లేదన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందో తాజాగా బయటపడింది. దాదాపు 70 వేల యాప్లను ఫేస్బుక్నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ సంస్థ శుక్రవారం తెలిపింది. ఫేస్బుక్ ఖాతాదారులకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా వాడుకుంటున్నారనీ, ఇతర ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనీ తేలడంతో ఆ యాప్లను తొలగించినట్లు ఫేస్బుక్ తెలిపింది.
ఇంగ్లండ్కు చెందిన కేంబ్రిడ్జి ఎనలిటికా అనే సంస్థ ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని ఆక్రమంగా తీసుకున్న విషయం 2018 మార్చ్ నెలలో బయటపడడంతో ఈ సమాచార చౌర్యంపై ఫేస్బుక్ దర్యాప్తు మొదలుపెట్టింది. అలా సంపాదించిన సమాచారాన్ని కేంబ్రిడ్జి ఎనలిటికా కొన్ని దేశాలలో ఎన్నికలలో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల విజయావకాశాలను మెరుగుపరిచేందుకు ఉపయోగించింది. ఇండియాలో కూడా కొన్ని పార్టీలు ఎన్నికల సందర్భంగా కేంబ్రిడ్జి ఎనలిటికాను కన్సల్టెంట్గా నియమించుకున్నాయి.
400 యాప్లను సస్పెండ్ చేసినట్లు 2018 ఆగస్టులో ఫేస్బుక్ ప్రకటించింది. ఈ యాప్ల సమాచార చౌర్యం ఎంత లోతైన వ్యవహారం అన్నది తాజాగా బోస్టన్లోని ఒక కోర్టులో ఫేస్బుక్ దాఖలు చేసిన పత్రాల ద్వారా తెలిసింది. మొత్తం 69,000 యాప్లను సస్పెండ్ చేసినట్లు ఫేస్బుక్ వాటిలో పేర్కొన్నది. వ్యక్తిగత సమాచార చౌర్యంపై ఫేస్బుక్ చేస్తున్న దర్యాప్తునకు సహకరించనందుకు ఎక్కువ భాగం యాప్లను సస్పెండ్ చేశారు. సుమారు 10,000 యాప్లను సమాచార చౌర్యం చేసినందుకు తొలగించారు.
ఫేస్బుక్లో రకరకాల యాప్లు ఉన్నాయి. స్పోటిఫై వంటి మ్యూజిక్ యాప్ మొదలుకొని కాండీ క్రష్ వంటి గేమింగ్ యాప్ వరకూ లెక్కలేనన్ని యాప్లు ఫేస్బుక్ను వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. వీటిలో కొన్ని ఫేస్బుక్ను తమ యాప్లో ప్రవేశానికి దారినిచ్చే గేటులాగా ఉపయోగించుకుంటాయి.
ఫేస్బుక్లో వ్యక్తిగత సమాచారానికి ఏమాత్రం భద్రత ఉందన్న విషయమై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచలేపోయిందన్న విమర్శలను ఫేస్బుక్ ఒక ఏడాదిగా ఎదుర్కొంటున్నది. తాజాగా వెలికివచ్చిన సమాచారం ఫేస్బుక్ను మరింత ఇబ్బంది పెడుతుందన్న విషయంలో సందేహం లేదు.
ఫేస్బుక్పై దర్యాప్తు చేస్తున్న అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్తో గత జూలైలో ఆ సంస్థ ఒక ఒప్పందానికి వచ్చింది. దాని ప్రకారం కమిషన్కు ఫేస్బుక్ 500 కోట్ల డాలర్లు జరిమానా చెల్లిస్తుంది. భవిష్యత్తులో సమాచారం భద్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇది చాలదని అనేవారు చాలామందే ఉన్నారు. ఫేస్బుక్ యజమాని మార్క్ జుకర్బర్గ్ను వ్యక్తిగతంగా జవాబుదారీ చేయాలని శుక్రవారం నాడు అమెరికా సెనెటర్ రాన్ వైడెన్ అన్నారు.