బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజా మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పరమేశ్వరతోపాటు మరో కాంగ్రెస్ నేత ఆర్.ఎల్.జాలప్ప ఇళ్లు, కార్యాలయాలపై అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బెంగళూరు, తుముకూరు సహా మొత్తం 30 ప్రదేశాల్లో ఐటీ శాఖ తనిఖీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పరమేశ్వరకు చెందిన ట్రస్టు ఓ మెడికల్ కాలేజీని నిర్వహిస్తున్నది. ఆ కాలేజీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఐటీశాఖ దాడులు చేస్తున్నట్లు సమాచారం. సిద్దార్థ విద్యా సంస్థలు, డిగ్రీ కాలేజ్ లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. పరమేశ్వర్ కు చెందిన ఇల్లు, విద్యా సంస్థల్లో ఐటీ శాఖ అధికారులు రికార్డులు పరిశీలించారు.
ఐటీ దాడులు జరుగుతున్న సందర్బంగా మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఐటీ అధికారులకు తాను పూర్తిగా సహకరించినట్టు తెలిపారు. అయితే ఎక్కడ దాడులు జరుగుతున్నాయో తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఐటీ సోదాలు చేసినా తనకేమీ ఇబ్బందిలేదన్నారు. తాను చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, అవినీతి సొమ్ము సంపాదించలేదని తెలిపారు. తాను అక్రమాలకు పాల్పడ్డానని వెలుగు చూస్తే ఐటీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
The series of IT raids on @DrParameshwara, RL Jalappa & others, are politically motivated with malafide intention. They are only targeting @INCKarnataka leaders as they have failed to face us on policy & corruption issues.
We won't budge to any such tactics!!
— Siddaramaiah (@siddaramaiah) October 10, 2019
ఐటీ దాడులను కర్నాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఖండించారు. రాజకీయ దురుద్దేశంతో ఈ దాడులు చేసినట్లు ఆయన ఆరోపించారు. మరోవైపు కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి డికె శివకుమార్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులోనే ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రాజకీయంగా తనపై కక్షకట్టి జైల్లో పెట్టారని శివకుమార్ ఆరోపించారు.
ఇదిఇలా ఉంటే..ఇవాళ్టి నుంచి కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా మాజీ సీఎం సిద్దరామయ్యనే వరించింది. ఈ సమావేశాల మొదటి రోజునే పరమేశ్వర ఇంటిపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.