ఫోటో: ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు
అమరావతి: కొత్త ప్రభుత్వం వచ్చి గట్గిగా నెల గడిచిందో లేదో రాష్ట్రంలో అధికారపక్షానికీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి మధ్య ఘర్షణ వాతావరణం కనబడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొంతకాలం సమయం ఇచ్చి చూద్దామని ముందు పేర్కొన్న ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
ఆయన శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలం, రుద్రమాంబపురం గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన టిడిపి కార్యకర్త బసంగారి పద్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వెళుతున్నారు. ఆ కుటుంబానికి అయిదు లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని కూడా పార్టీ తరపున అందజేయనున్నారు.
వైసిపి కార్యరకర్తల చేతిలో అవమానానికి గురయిన కారణంగా పద్మ ఆత్మహత్య చేసుకున్నదని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయనీ, ఇప్పటికి ఆరుగురిని హత్య చేశారనీ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. చాల చోట్ల అధికారపక్షం, ప్రతిపక్షం కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం ఉన్న మాట వాస్తవం.
ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తగిన సామరస్య వాతావరణం రాష్ట్రస్థాయిలో నెలకొనకపోవడం కూడా ఉద్రిక్తతలు పెరిగేందుకు దోహదపడుతోంది. ప్రజావేదిక కూల్చివేత మొదలు ప్రతిపక్షం, అధికారపక్షం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రజాస్వామ్యంలో రెండు రాజకీయపక్షాల మధ్య ఉండాల్సిన కనీస సుహృద్భావం టిడిపి, వైసిపి మధ్య లేకపోవడం కింద స్థాయిలో కార్యకర్తల మధ్య వైరానికి మరింత ఆజ్యం పోస్తున్నది. మొన్న వైసిపి, టిడిపి ప్రతినిధిబృందాలు ఒకేరోజు పోటాపోటీగా డిజిపి దగ్గరకు వెళ్లి తమ కార్యకర్తలపై దాడుడు జరుగుతున్నాయని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
ఇలాంటి ఘర్షణ వాతావరణంలో చంద్రబాబు కార్యకర్తలకు ధైర్యం చెప్పడం కోసం అంటూ బయటకువెళుతున్నారు. ఈ పర్యటనలు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తాయి తప్ప చల్లబరచవు.