అమరావతి: నూతన ప్రభుత్వానికి కాస్త టైం ఇచ్చి చూడాలనీ, తర్వాతే నోరు విప్పాలనీ అనుకున్న టిడిపి ఆలోచన మార్చుకున్నది. ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు నివాసానికి కూడా నోటీసు ఇవ్వడం టిడిపి ధోరణిలో మార్పు తెచ్చింది. వీటికన్నా ముఖ్యంగా టిడిపి ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయంటూ, వాటి నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులతో ఉపసంఘం నియమించడం ప్రతిపక్షానికి ఆగ్రహం తెప్పించింది.
ఇక అధికారపక్షంపై నేరుగా దాడి చేయక తప్పదని టిడిపి నాయకత్వం నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. మాటకు మాట బయటకు వస్తున్నది. దాడికి ప్రతి దాడి జరుగుతున్నది. తాజాగా చంద్రబాబు తనయుడు లోకేష్, మంత్రుల ఉపసంఘం నియామకంపై స్పందించారు.
నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా.. అక్రమాస్తుల కేసులో ఏ1 అయిన జగన్ అవినీతిపై కమిటీ వేశారనీ, ఏ2 విజయసాయిరెడ్డి అందులో సభ్యుడనీ ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఇది నిజాయితీకే సిగ్గుచేటు అని ఆయన పేర్కొన్నారు. కలికాలం కాకపోతే అక్రమాల విక్రమార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడటమా అని లోకేష్ వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ 14 రూపాయలకు కొన్నారనీ, టీడీపీ హయాంలో 2.70 కే యూనిట్ కొన్నారనీ లోకేష్ తెలిపారు. వైఎస్ కారణంగా డిస్కంలకు ఎనిమిది వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని పేర్కొంటూ ఈ ఉదాహరణలు చాలవా, ఎవరు మహామేతో! ఎవరు దార్శనిక నేతో తెలుసుకోడానికి అని లోకేష్ ప్రశ్నించారు. ఎలాంటి విచారణ జరపకుండా 2,636 కోట్లు అవినీతి జరిగిందని ఎలా తేల్చారని ఆయన ప్రశ్నించారు. గుడ్డ కాల్చి ముఖాన వెయ్యడంలో మీకు మీరే సాటి అని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
.@ysjagan గారూ! ఏపీతో చేసుకున్న వివిధ ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్, ఏపీ సిఎస్ కు రాసిన లేఖ ఇది. మామూలుగా చెబితే మీ తలకెక్కదనే, మీ ముఖ్యమంత్రికి కాస్త అర్థమయ్యేలా చెప్పమని కూడా ఇందులో రాసారు. ఇకనైనా నిరాధార నిందలు వేయడం మానండి. pic.twitter.com/ATTaXMUhD8
— Lokesh Nara (@naralokesh) June 28, 2019