(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు పాదయాత్రగా మందడం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులకు, టిడిపి నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలను పోలీస్ లు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్స్టేషన్ తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబు వాహనాన్ని
కరకట్ట వైపు కాకుండా వెంకటాయపాలెం వైపు మళ్లించారు. మళ్లీ మందడం, కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకొనివెళ్ళారు.
తొలుత అసెంబ్లీ బయట చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఓ చీకటి రోజని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు అమరావతిని చంపేయాలనే ఘోర తప్పిదానికి జగన్ శ్రీకారం చుట్టారని విమర్శించారు. ‘జగన్ వయసులో చిన్న వాడైనా దణ్ణం పెట్టి అడిగా. అయినా కనికరం చూపించలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.