అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ స్టాల్లో కేజీ ఉల్లిగడ్డలు 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనడంపై చంద్రబాబు స్పందించి వివరణ ఇచ్చారు. ఆ స్టాల్ ప్యూచర్ గ్రూపులో ఉన్న విషయం మీ ఇంటిలిజెన్స్ వ్యవస్థ చెప్పలేదా అని జగన్మోహనరెడ్డిని ప్రశ్నించారు. చంద్రబాబు వివరణ ఇస్తున్న సమయంలో మంత్రి పుష్ప శ్రీవాణి కల్పించుకుని హెరిటేజ్ వారిది కాకపోతే తమకు హెరిటేజ్కు సంబంధించిన స్వీట్స్ను నారా బ్రహ్మిణి ఎలా పంపించారని ప్రశ్నించారు.
దీనిపై హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ఫ్రెష్కు తేడా తెలియని వారు శాసనసభలో ఉన్నారంటూ చంద్రబాబు విమర్శించారు. హెరిటేజ్ ఫ్రెష్ ప్యూచర్ గ్రూపుకు ఎప్పుడో అమ్మేశామని చెప్పారు. తానూ ముఖ్యమంత్రికి చెందిన భారతీ సిమెంట్స్, సాక్షి ఛానల్, పవర్ ప్లాంట్ తదితర సంస్థలపై మాట్లాడగలననీ కానీ ఇది సందర్భం కాదని చంద్రబాబు అన్నారు. ప్రజల సమస్యలన్నీ గాలికి వదిలివేసి 24 గంటలూ తన మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారనీ, అలా చేస్తేనే వారికి ఆనందంగా ఉంటుందనీ,చేసుకోండి ఇబ్బందేమి లేదు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.