అమరావతి: సచివాలయ ఉద్యోగ నియామకాల స్కామ్ విషయంపై ప్రభుత్వం గానీ, పంచాయతీరాజ్ శాఖ గానీ ఇంత వరకూ వివరణ ఇవ్వలేదని టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు ధ్వజమెత్తారు.
గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణకు తమకు ఎటువంటి సంబంధం లేదని ఎపిపిఎస్సి వివరణ ఇచ్చిన నేపథ్యంలో వీరు ట్విట్టర్ వేదికగా స్పందించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల స్కామ్ విషయమై ప్రభుత్వం గానీ, పంచాయతీరాజ్ శాఖ గానీ ఇంత వరకూ స్పందించలేదని చంద్రబాబు అన్నారు. ఏపిపిఎస్సిని అడిగితే పరీక్షలను మేము నిర్వహించలేదనీ. తమ సంబంధం లేదంటోందనీ చంద్రబాబు పేర్కొన్నారు. 18 లక్షల మంది భవిష్యత్తుతో ఏమిటీ నాటకాలు అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
తోలుబొమ్మలాట మధ్యలో కేతిగాళ్ళలా ఎవరెవరో వచ్చి టిడిపి ఓర్వలేకపోతుందని విమర్శిస్తున్నారు, అంత ఓర్వలేకపోవడానికి తమరు చేసిన ఘనకార్యాలేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. తమరు గడ్డి తినడం చూసి, నీతి మాలిన పనులు చూసి అసూయపడాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ముందుగా ఈ స్కామ్పై విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. యువతకు వైసిపి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సహించేది లేదని చంద్రబాబు అన్నారు.
అసలు గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలకి తల్లి, తండ్రి ఎవరు అని నారా లోకేష్ ప్రశ్నించారు. జరిగిన స్కామ్కి తమకు సంబంధం లేదనీ, పరీక్షలు తాము నిర్వహించలేదనీ ఏపిపిఎస్సి అంటున్నదని లోకేష్ అన్నారు. పరీక్షలు నిర్వహించింది ఏపిపిఎస్సి అని మంత్రులు అంటున్నారు. ఇంతకీ పరీక్షలు పెట్టింది ఎవరని లోకేష్ ప్రశ్నించారు. 18 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారా అని లోకేష్ విమర్శించారు.
పరీక్షలు నిర్వహించింది ఎవరు అనేది తెలియదు గానీ పేపరు లీకేజీ స్కామ్కి తండ్రి మాత్రం వైఎస్ జగన్యేనని లోకేష్ ఆరోపించారు. చిన్న వయస్సులోనే ఆయన లీక్ వీరుడు కదా, ఇప్పుడు పేపర్లు లీక్ అవ్వడంలో పెద్ద విచిత్రం లేదని లోకేష్ వ్యంగ్యంగా అన్నారు.