అమరావతి: వైసిపి ప్రభుత్వ వేధింపులపై రాజీలేని పోరాటం చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులతో మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. చింతమనేని ప్రభాకర్, అఖిలప్రియ, వల్లభనేని వంశీ తదితరులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనీ, తప్పుడు కేసులతో కోడెల శివప్రసాద్ను బలి తీసుకున్నారనీ చంద్రబాబు ఆరోపించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలను దారుణంగా వేధిస్తూ, ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం కార్యకర్తలు నిలబడ్డారని చంద్రబాబు అన్నారు. టిడిపి ఎంపిలు ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఇచ్చిన వినతి పత్రంపై ఈ రోజు నుండి మానవహక్కుల కమిషన్ బృందం నవంబర్ ఒకటి వరకూ రాష్ట్రంలో పర్యటిస్తోందని చంద్రబాబు చెప్పారు. ఈ బృందం ఆత్మకూరు, జంగేశ్వరపాడు, పిన్నెల్లి, పొనుగుపాడు ప్రాంతాల్లో పర్యటిస్తుందనీ, వైసిపి నేతల బాధితులు అందరూ మానవహక్కుల బృందాన్ని కలవాలనీ చంద్రబాబు తెలిపారు. పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను నెల రోజుల్లో తీయిస్తామనీ శాసనమండలిలోనే హామీ ఇచ్చారనీ, నాలుగు నెలలు అయినా కానీ గోడ తీయించలేదనీ చంద్రబాబు పేర్కొన్నారు. ఇది చూసి మిగిలిన చోట్ల కూడా వైసిపి నేతలు రెచ్చిపోతున్నారని చంద్రబాబు అన్నారు. అనంతరం జిల్లా వెంకటాపురంలో కూడా టిడిపి కార్యకర్త ఇంటి చుట్టూ గోడ కట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసిపి అరాచకాలను హ్యూమన్ రైట్స్ బృందానికి వివరించాలని చంద్రబాబు సూచించారు.
రాష్ట్రంలో వైసిపి నేతల స్వార్థానికి రోజు కూలీలు బలి అవుతున్నారని చంద్రబాబు విమర్శించారు. లక్షలాది కార్మికులు జీవనోపాధిని దెబ్బతీశారని చంద్రబాబు అన్నారు. సొంత గ్రామాల్లో వాగుల్లో ఇసుక తెచ్చుకోవడానికీ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పది రెట్ల ఎక్కువ ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆన్లైన్లో ఇసుక అమ్మకాలు జగన్మాయగా మారిందనీ, అరగంటలోనే నో స్టాక్ బోర్డులు పెడుతున్నారనీ చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కూదేలయ్యే దుస్థితి తెచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు.
జలాశయాలు ఎందుకు నింపలేదని సిఎం ఇప్పుడు అధికారులను ప్రశ్నించడం హస్యాస్పదంగా ఉందని చంద్రబాబు అన్నారు. వరదల్లో నాలుగు వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృధాగా పోయాయని చంద్రబాబు పేర్కొన్నారు. టిడిపి చేసిన అభివృద్ధి పనులన్నీ రివర్స్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
టిడిపి నిర్మించిన భవనాలకు వైసిపి రంగులు వేస్తూ ప్రజల్లో టిడిపి అభివృద్ధి ముద్ర చెరిపివేయాలని పన్నాగాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
రాజధానిపై ప్రభుత్వం మరో కమిటీని వేసిందట, దానికి సూచనలు ఇవ్వాలట అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.