అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నివాసంలో బుధవారం జరిగిన ముఖ్యనేతల అత్యవసర సమావేశానికి పలువురు కాపు సామాజిక వర్గ నేతలు గైరు హజరయ్యారు. తోట త్రిమూర్తులతో పాటు జ్యోతుల నెహ్రూ, బూర్లగడ్డ వేదవ్యాస్, పంచకర్ల రమేష్, విజయవాడలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తదితర నాయకులు సమావేశానికి గైరుహాజరు అవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
దీనికి తోడు ప్రజావేదిక కూల్చివేతపై త్రిమూర్తులు భిన్నంగా వ్యాఖ్యానించారు. ఈ రోజు గైరు హాజరు అయిన వారు ఈ నెలలోనే కాకినాడలో జరిగిన టిడిపిలోని కాపు నేతల సమావేశంలో పాల్గొన్నారు.
చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నసమయంలోనే పార్టీలో పలు అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బిజెపిలో చేరడం, కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు కాకినాడలో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల క్రితం ఏలూరుకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పార్టీని వీడి బిజెపిలో చేరారు. ఈ పరిణామాలపై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు నేడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయడంపై పలువురు టిడిపి నేతలు ఆక్షేపణ వ్యక్తం చేస్తుండగా కాకినాడ సమావేశంలో ముఖ్య భూమికను పోషించిన సీనియర్ టిడిపి నేత తోట త్రిమూర్తులు నేడు ప్రజావేదిక కూల్చివేతపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. అది ప్రభుత్వ ఆస్తి, దాన్ని ఏమైనా చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందంటూ త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు టిడిపి నేతలు రాద్ధాంతం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పుకోసమే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళనకు దిగారని త్రిమూర్తులు విమర్శించారు. ప్రజావేదిక విషయంలో ఆందోళన నిర్వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని ఆయన అన్నారు. కరకట్టపై ఉన్న ఇతర అక్రమ నిర్మాణాల విషయంలోనూ సిఎం జగన్ ఇలాగే స్పందించాలని త్రిమూర్తులు డిమాండ్ చేశారు.
బూరగడ్డ వేదవ్యాస్ తనకు సమావేశానికి సంబంధించి అహ్వానం రాలేదని, పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం అని తెలిసి హజరుకాలేదని చెప్పారు. ఇతరుల సంగతేమో కానీ తాను మాత్రం సమావేశం అయిన తరువాత పార్టీ నేతను కలుస్తాననీ, వేరే అలోచన ఏమీలేదని వేదవ్యాస్ తెలిపారు.
.