అమరావతి: రాష్ట్రంలో దుర్మార్ఘ పాలన కొనసాగుతోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా విమర్శించారు. టిడిపి కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజు మంగళవారం అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అసెంబ్లీలో తాను అనని మాటలను అన్నట్లుగా చూపుతున్నారని ధ్వజమెత్తారు. టిడిపి ఎమ్మెల్యేలను సిఎం జగన్ బఫూన్లు అని సంభోదించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తాము బఫూన్లు అయితే జగన్ ఏమిటని ప్రశ్నించారు. అంత కంటే పెద్ద పదం వాడాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని చంద్రబాబు విమర్శించారు. రివర్స్ టెండరింగ్ ఫార్స్ టెండరింగ్గా మారిందని అన్నారు. పోలవరంలో 750 కోట్ల రూపాయలు ఆదా చేశామని దొడ్డిదారిన మళ్లీ వ్యయం పెంచారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో టిడిపి కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయనీ, ప్రభుత్వాన్ని విమర్శించే వారి ఆర్థిక మూలాలపై దాడులు జరుగుతున్నాయనీ చంద్రబాబు మండిపడ్డారు. ఇది కొత్త తరహా దాడులని అన్నారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని చంద్రబాబు అన్నారు. అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారనీ, మీడియా గొంతు నొక్కేశారనీ చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో కొంత మంది అధికారులు జైలుకు వెళ్లారనీ, అలాంటి పరిస్థితులు పోలీసులు తెచ్చుకోవద్దనీ చంద్రబాబు హితవు పలికారు. అధికారపక్షం ఎన్ని విమర్శలు చేసినా, తిట్టినా ప్రజల కోసం భరిస్తున్నామన్నారు. ప్రజా సమస్యపై టిడిపి రాజీలేని పోరాటం చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.