(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఫించను అర్హత వయసు అయిదేళ్లు తగ్గిస్తే లబ్దిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటీ జగన్మాయ అని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఫించన్ లబ్దిదారుల సంఖ్యలో కోత విధిస్తున్నారని జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘ఎనిమిది నెలల్లో ఏడు లక్షల పించన్లకు కోత పెట్టడం పండుటాకులను మోసం చేయడం కాదా?, 45 ఏళ్లకే బిసి, ఎస్సి, ఎస్సి, మైనారిటి మహిళలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి ఏమార్చడం మోసం కాదా?’ అని ప్రశ్నించారు.
‘కేంద్రం ఇచ్చిన ఆరు వేల రూపాయలకు అదనంగా 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి, రైతులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతకు టోపి పెట్టారు. ఇంత మోసకారి కాబట్టే 12 చార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. అయినా మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదు’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.