(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి గుండె పోటుతో మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించారు.రైతులు, రైతు కూలీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారనీ, ప్రభుత్వ దుర్మార్గ చర్యల వల్లే ముగ్గురు రైతులు చనిపోయారనీ తెలిపారు. రైతుల కుటుంబాలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఎవరి మొహాల్లో నవ్వు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ రైతులు, మహిళలను అవహేళన చేయడం దుర్మార్ఘమన్నారు. ధర్నాలు, ర్యాలీలు చేయకుండా ఆంక్షలు పెట్టారనీ, తప్పుడు కేసులు పెడుతున్నారనీ చంద్రబాబు మండిపడ్డారు.ఉద్యమాన్ని ఎంత అణిచివేస్తే అంత రెచ్చిపోతారని చంద్రబాబు హెచ్చరించారు.మూడు రాజధానులు వద్దు,. అమరావతి ఒకటే ఉండాలని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారని అన్నారు.