అమరావతి: ముఖ్యమంత్రి, మంత్రిమండలికి దుర్గమ్మతల్లే జ్ఞానోదయం కల్గించాలని వేడుకున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో దుర్గమ్మను దర్శించుకొని అమరావతిని పరిరక్షించాలనీ, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ఒకటే ఇల్లు ఉండాలనీ, అయిదు కోట్ల మంది ప్రజలు ఆవేదనగా ఉన్నారనీ పేర్కొన్నారు. గతంలో విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారనీ, ఎగతాళి చేసినోళ్లు ఇవాళ తెలంగాణ అభివృద్ధిని చూడాలని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రివర్గానికి దుర్గమ్మ జ్ఞానోదయం కల్గించాలని కోరుకున్నట్లు తెలిపారు.
రాజధానిగా అమరావతి ఉండాలనీ, అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనీ, ప్రతి ఒక్కరు సంకల్పం చేసుకోవాలనీ చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతుల వెంట విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే రామానాయుడు తదితరులు ఉన్నారు.