(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తిరుపతి: మూడు రాజధానుల అంశంపై టిడిపి నేత, మాజీ మంత్రి అమరనాధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను రాజధానిగా ప్రకటిస్తే అక్కడకు వెళ్లేందుకు రాయలసీమ వాసులకు దూరాభారం అవుతుందనీ, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందనీ అమరనాధ్ రెడ్డి అన్నారు. అన్ని వసతులు ఉన్న తిరుపతి రాజధానిగా ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే రెండు రాష్ట్రాల రాజధానులు చెన్నై, బెంగుళూరు ఉన్నాయన్నారు.
తిరుపతిని రాజధానిగా చేయండి లేకుంటే రాయలసీమలోని పడమటి ప్రాంతాలను కర్నాటకకు, తూర్పు ప్రాంతాలను తమిళనాడుకు తరిమివేసి (కలిపి) పుణ్యం కట్టుకోవాలని అమరనాధ్ రెడ్డి కోరారు.
‘రాజధానులుగా చెన్నై అయిపోయింది, కర్నూలు అయిపోయింది. హైదరాబాద్ అయిపోయింది, ఇప్పుడు అమరావతి కూడా అయిపోయింది. ఇప్పుడు చించి చించి మూడు ముక్కలు చేస్తామంటున్నారు, ఈ మూడు ముక్కల ఆట మా వల్ల కాదు’ అంటూ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో రాయలసీమ పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని అమరనాధ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విశాఖను రాజధానిగా అంగీకరించే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళితే రాయలసీమ పరిరక్షణ కోసం చిత్తూరు జిల్లా నుండే పోరాటాన్ని ప్రారంభించి ఉధృతం చేస్తామని అమరనాధ్ రెడ్డి హెచ్చరించారు.