ఓ మంత్రి కుమారుడు తన జన్మదిన వేడుక సందర్భంగా తీసుకున్న ఒ పెద్ద బహుమతి నేడు ఆ మంత్రికి అవినీతి మరక అంటే పరిస్థితికి వచ్చింది. ఈఎస్ఐ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్న సమయంలో పరికరాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుని అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే.
అయితే ఈ వ్యవహారంలో ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి జయరాం పాత్ర ఉందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపిస్తున్నారు. ఎటువంటి సాక్షాధారాలు లేకుండా తమ పార్టీ నేత అచ్చెన్నాయుడుని ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. ఇప్పుడు తాను ఆ కేసులో నిందితుడికి, మంత్రి జయరాం కుమారుడికి ఉన్న సంబంధాలను బహిర్గత పరుస్తున్నాననీ, అవినీతిని సహించని పేర్కొంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సదరు మంత్రి అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు.
ఈఎస్ఐ స్కామ్ 14వ నిందితుడుగా అరెస్టు అయిన తెలుకుపల్లి కార్తీక్ గత ఏడాది డిసేంబర్ లో కార్మిక శాఖ మంత్రి జయరాం కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్ కి బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు అయ్యన్నపాత్రుడు. వారి మధ్య ఎటువంటి లావాదేవీలతో కారును బహుమతిగా ఇచ్చారని ప్రశ్నించారు. ఏ 14 కార్తీక్ గత ఏడాది డిసెంబర్ 12న నానేష్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుండి బెంజ్ కారు కొనుగోలుకు 45 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. అయితే షోరూమ్ నుండి ఆ కారును మంత్రి కుమారుడు ఈశ్వర్ తీసుకున్నారు. ఇక్కడ ట్విట్ట్ ఏమిటంటే ఆ కారు తన సొంతదిగా బెంజ్ కారుతో ఫోోటో దిగి తన ఫేస్ బుక్ ఖాతాలోనూ పెట్టుకున్నారు. ఈ ఏడాది జూలైలో మంత్రి కుమారుడు పెళ్లి వేడుకల్లోనూ ఆ బెంజ్ కారును వాడుకున్నారు. జూన్ 10వ తేదీన తెలుకపల్లి కార్తీక్ పై ఎసిబి కేసు నమోదు కాగా జులైలో అరెస్టు చేశారు.
నిందితుడు కార్తీక్ కొనుగోలు చేసిన బెంజ్ కారును మంత్రి కుమారుడు ఈశ్వర్ షో రూమ్ నుండి తీసుకుని వాడుకుంటుండటం వెలుగులోకి రావడంతో మంత్రి కుమాురడికి బెంజ్ కారును లంచంగా ఇచ్చారని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపిస్తున్నారు. ఈ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అయ్యన్నపాత్రుడు మీడియాకు వెల్లడించారు. కాగా అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి జయరాం ఖండించారు. తన కుమారుడికి అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారనీ వారి కోసం షో రూమ్ నుండి కారు డెలివరీ తీసుకొని ఉండవచ్చని అన్నారు. ప్రస్తుతం మంత్రి ఈ విధంగా చెప్పి తప్పుకున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఊరుకుంటారా? అంతర్గత విచారణ అయినా జరుపుతారుగా? చూద్దాం టీడీపీ నేత ఆరోపణలో నిజం ఉందో లేదో త్వరలోనే వెల్లడి కానున్నది.