రాష్ట్రంలో 2019 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం..ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విషయంలో జగన్మోహనరెడ్డి సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. కొందరు టిడిపి నేతల్లో ఒ అభద్రతాభావం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో టిడిపి నుండి గెలిచిన 23మంది ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరుగా టీడీపిని వీడి వైసిపి పంచన చేరారు. మరో పక్క ఇఎస్ఐ స్కామ్ కేసులో మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, నకిలీ పత్రాలతో వాహనాలు కొనుగోలు చేశారన్న ఆరోపణపై మాజీ మంతి జెసి దివాకరరెడ్డి సోదరుడు జేసి ప్రభాకరరెడ్డి ఆయన తనయుడుని, మచిలీపట్నంలో జరిగిన ఒ హత్య కేసులో మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేసి కటకటాల పాలు చేసిన విషయం తెలిసిందే. ఓ పక్క వైసిపి ప్రభుత్వంతో పాటు బిజెపి కూడా తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేస్తున్నది.
కరోనా ప్రబలినప్పటి నుండి టిడిపి అధినేత చంద్రబాబుతో సహా ఆయన కుమారుడు లోకేష్ హైదరాబాద్ నుండే పార్టీ వ్యవహారాలు, పత్రికా సమావేశాలు, నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీపై దూకుడుగా వెళ్లే నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది నాయకులు కరోనా కలిసి రావడంతో సైటెంట్ గా ఉండిపోతున్నారు. మరి కొందరు వేరే దారులు వెతుక్కుంటున్నారు. కొందరు అధికార వైసిపి వైపుకు, మరి కొందరు బిజెపి వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని తొలగించేందుకు, భవిష్యత్తు నాయకుడిగా తాను ఉన్నాను అని ప్రొజెక్ట్ చేసుకునే విధంగా నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నారుట. రాష్ట్రంలో నేతలకు పాదయాత్ర సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది. తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నిర్వహించిన తరువాత సిఎం పదవిని అధిష్టించారు. ఆ తరువాత చంద్రబాబు, జగన్మోహనరెడ్డిలు ఇద్దరూ పాదయాత్రలు చేసిన తరువాత ముఖ్యమంత్రులు అయ్యారు. వయోభారం, ఆరోగ్యం సహకరించని పరిస్థితి ఉన్న కారణంగా చంద్రబాబు మరో మారు పాదయాత్ర చేసే అవకాశం లేదు. ఈ కారణంగా నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నారని టాక్. అయితే పాదయాత్ర చేయాలా, తమ పార్టీ గుర్తు ఎలివేట్ అయ్యేలా సైకిల్ యాత్ర చేయాలా అన్న విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. మరో పక్క కరోనా లాక్ డౌన్ కాలంలో లోకేష్ తన బరువు తగ్గించుకునేందుకు వర్క్ అవుట్ లు చేస్తున్నారనీ, గతంతో పోల్చుకుంటే ఈ మధ్య స్లిమ్ అయ్యాడంటూ కూడా సోషల్ మీడియాలో సైటెర్ లు దర్శనమిస్తున్నాయి.
ఇటీవల వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టిడిపిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. సోషల్ మీడియాలో సెటైర్లు, పంచ్ ఆసక్తిని రేపుతున్నాయి. ఇంతకూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే.. పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా, వయసు పెరగడం, జ్ఞాపక శక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట, కరోనా ఉదృతి తగ్గగానే లోకేషే నాయుడును కాబోయే సిఎంగా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయంచాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. అయితే దీనిపై నారా లోకేష్ స్పష్టమైన ప్రకటన అయితే ఏమీ ఇంత వరకూ చేయలేదు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో.