విజయవాడ: నాలుగు లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికి.. జగన్ ప్రభుత్వం పది లక్షల మంది ఉద్యోగాలను తొలగిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. తమ ఉద్యోగాల భద్రత కోసం ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేస్తున్న ‘మీ సేవా’ సిబ్బందికి నారా లోకేష్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 సంవత్సరాల నుండి ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉన్న మీ సేవ వ్యవస్థని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. 30 వేల కుటుంబాలు మీసేవపై ఆధారపడి బతుకుతున్నాయన్నారు. మీ సేవ ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారుగా 200 కోట్ల ఆదాయం కూడా వస్తుందని తెలిపారు.
పాదయాత్రలో మీ సేవ ఆపరేటర్లు జీవితాలు మారుస్తా అని అనేక హామీలు ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో మీ సేవ ఆపరేటర్లను, 30 వేల కుటుంబాలను రోడ్డు మీదకు నెట్టారని విమర్శించారు. ఆందోళనతో మీ సేవ ఆపరేటర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని, ఆత్మహత్య చేసుకున్న మీ సేవ సిబ్బంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మీ సేవ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ ఉండేదని, జగన్ తీసుకొస్తున్న వ్యవస్థ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదన్నారు. పెట్టుకున్న ఆర్జికి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. తాను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నపుడు ఒక్క ఈ మెయిల్ ఇస్తే సమస్యలు పరిష్కరించానని గుర్తు చేశారు. మీసేవా ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
మీ సేవ వ్యవస్థను కొనసాగించాలని, మీ సేవ సిబ్బంది పోరాటానికి టిడిపి మద్దతు ఉంటుందని తెలిపారు. మీసేవ సిబ్బందికి న్యాయం జరిగే వరకూ మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మీసేవ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీ, మండలిలో ప్రస్తావిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు.
మీ సేవ వ్యవస్థను కొనసాగించాలి. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకూ మీ సేవ సిబ్బందికి అండగా శాసనసభ, మండలిలో పోరాటం చేస్తాం.(2/2)
— Lokesh Nara (@naralokesh) January 8, 2020